శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2017 (11:46 IST)

ఎల్కే.అద్వానీ - జోషి- ఉమలు కుట్రదారులే : బాబ్రీ కేసు పునర్విచారణకు సుప్రీంకోర్టు ఒకే

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రెండున్నర దశాబ్దాలనాటి కేసులో బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే.అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతిలతో పాటు.. 13 మంది బీజేపీ నేతలు కు

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రెండున్నర దశాబ్దాలనాటి కేసులో బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే.అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతిలతో పాటు.. 13 మంది బీజేపీ నేతలు కుట్రదారులేనని పేర్కొంది. అందువల్ల వారిపై నమోదైన కుట్ర అభియోగాలను పునరుద్ధరించింది. 16 శతాబ్దం నాటి బాబ్రీ మసీదును కూల్చివేసేందుకు కుట్రపన్నారన్న ఆరోపణలపై విచారణ కొనసాగాల్సిందేనని స్పష్టం చేసింది. 
 
ఈ ముగ్గురు నేతలు సహా మరికొందరిపై నేరారోపణలను పునరుద్ధరించాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌ను... జస్టిస్ పీసీఘోష్, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం స్వీకరించింది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ... లక్నోలోని ట్రయల్ కోర్టులో విచారణకు ఆదేశించింది. ఈ కేసు విచారణను రెండేళ్లలో పూర్తి చేయాలని ఆదేశించింది. 
 
సాంకేతిక కారణాలను చూపుతూ లక్నో కోర్టు బీజేపీ నేతలపై నేరారోపణలను కొట్టేసిన 16 ఏళ్లకు అత్యున్నత న్యాయస్థానం మళ్లీ తిరగదోడడం విశేషం. తొలి మొఘల్ చక్రవర్తి బాబార్ బాబ్రీ మసీదును నిర్మించగా... శ్రీరాముడు కూడా ఇదే ప్రదేశంలో జన్మించాడని అనేకమంది హిందువులు నమ్ముతారు. 2.7 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ వివాదాస్పద స్థలం... రాజకీయాలు, భావోద్వేగాల పరంగా ఇప్పటికీ అత్యంత సున్నిత ప్రాంతంగా నిలుస్తూ వస్తోంది.