శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (10:05 IST)

అత్త మృతి - కోడలి సంతోషం ... భార్యను మిద్దెపై నుంచి తోసి చంపిన భర్త

అప్పటివరకు తనను రాసిరంపాన పెట్టిన అత్త చనిపోయింది. అంతే.. ఆ ఇంటి కోడలికి ఎక్కడలేని సంతోషం చెందింది. దీన్ని చూసిన ఆమె భర్త.. ఆగ్రహంతో ఊగిపోయాడు. తన తల్లి చనిపోతే సంతోషపడతావా అంటూ మిద్దెపై నుంచి భార్యను కిందికి తోసి చంపేశాడు. ఈ ఘటన వెస్ట్ మహారాష్ట్రలోని జునా రాజ్‌వాడ ఏరియాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జునా రాజ్‌వాడా అనే ప్రాంతానికి చెందిన మాలతి అనే వృద్ధురాలి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈనెల 9వ తేదీన చనిపోయింది.
 
దీంతో ఆమె కోడలు శుభంగి లోఖండే (35) పట్టరాని సంతోషంలో మునిగిపోయింది. తనలోని ఆనందాన్ని దాచులోకే శవం పక్కనే నిలబడి ఫక్కున నవ్వేసింది. దీన్ని శుభంగి భర్త సందీప్ లోఖండే కళ్లారా చూశాడు. 
 
తల్లి చనిపోయి తాను విషాదంలో ఉంటే నువ్వు ఆనదంపడతావా అంటూ భార్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాము నివశిస్తున్న అపార్ట్‌మెంట్ నుంచి కిందికి తోసేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన శుభంగి ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది. 
 
దీనిపై తొలుత స్థానిక మీడియా.. అత్త మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కోడలు అంటూ వార్తా కథనాలను ప్రచురించాయి. కానీ, పోలీసులు మాత్రం సందేహించి.. విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు విషయం వెల్లడైంది. దీంతో సందీప్ లోఖండేను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.