శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 మార్చి 2018 (12:10 IST)

రాహుల్ మొండివైఖరి వల్లే కాంగ్రెస్‌కు ఓటమి : మమతా బెనర్జీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొండివైఖరి వల్లే ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని వెస్ట్ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొండివైఖరి వల్లే ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని వెస్ట్ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. 
 
శనివారం వెల్లడైన ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయా ఎన్నికల్లో ముందుగానే చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాలని రాహుల్ గాంధీకి తాను ఎంతగానో చెప్పానని, పొత్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే కాంగ్రెస్ వైఫల్యం చెందిందని, అదే ఎత్తుగడతో బీజేపీ విజయం సాధించిందన్నారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలంటే ప్రాంతీయ పార్టీలతో భాగస్వామ్యమే ముఖ్యమని రాహుల్‌కు సూచించినా, తన మాటను వినలేదన్నారు. రాహుల్ నిర్లక్ష్యమే బీజేపీకి ఆయువుగా మారిందని, కాంగ్రెస్ నేతలు ఎవరి మాట వింటారో అర్థం కావట్లేదని, సొంత తప్పుల కారణంగానే ప్రతి ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతోందని ఈ మాజీ కాంగ్రెస్ మహిళా ఫైర్‌బ్రాండ్ ఆవేదన వ్యక్తంచేశారు.