శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 19 జూన్ 2018 (17:06 IST)

జమ్మూకాశ్మీర్‌‌: పీడీపీ-భాజపా తెగతెంపులు.. సీఎం పదవికి మెహబూబా ముఫ్తీ గుడ్ బై

జమ్మూకాశ్మీర్‌లో రంజాన్‌ సందర్భంగా ప్రకటించిన కాల్పుల విరమణ ముగిసిందని కేంద్రం ప్రకటించిన రెండు రోజుల్లోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. కాల్పుల విరమణ ముగిసిందనే నిర్ణయం పీడీపీ-భాజపాల మధ్య విభేదాలు తలెత

జమ్మూకాశ్మీర్‌లో రంజాన్‌ సందర్భంగా ప్రకటించిన కాల్పుల విరమణ ముగిసిందని కేంద్రం ప్రకటించిన రెండు రోజుల్లోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. కాల్పుల విరమణ ముగిసిందనే నిర్ణయం పీడీపీ-భాజపాల మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం.


నెల రోజుల కాల్పుల విరమణ సందర్భంగా కాశ్మీర్‌లో ఉగ్రదాడులు గణనీయంగా పెరిగిపోయాయి. ప్రముఖ జర్నలిస్టు సుజాత్‌ బుఖారీని ఈద్‌ రోజునే ఉగ్రవాదులు హత్య చేశారు. ఈ నేపథ్యంలో జమ్ము-కశ్మీర్‌లో పీడీపీతో పొత్తుకు భాజపా గుడ్‌బై చెప్పింది. 
 
భాజపా మంత్రులు ఢిల్లీలో పార్టీ అధినేత అమిత్‌షాతో భేటీకి అనంతరం ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీనిపై భాజపా జనరల్‌ సెక్రటరీ రామ్‌మాధవ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉగ్రవాదం పెరిగిపోవడంతో ప్రజల హక్కులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దీనికి సుజాత్‌ హత్యే తార్కాణమన్నారు.
 
దేశ దీర్ఘకాలిక రక్షణ, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో అధికారాలను గవర్నర్‌కు బదలాయిస్తున్నట్లు వెల్లడించారు. కాశ్మీర్‌లో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం అన్ని విధాలా ప్రయత్నించిందన్నారు. పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు చరమగీతం పాడేందుకు ప్రయత్నించామని చెప్పారు. పీడీపీ మాత్రం తన వాగ్దానాలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. జమ్ము-లద్దాక్‌ల అభివృద్ధి విషయంలో పీడీపీ నుంచి భాజపా నేతలకు ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. 
 
ఇకపోతే పీడీపీతో ఉన్న సంకీర్ణ బంధాన్ని బీజేపీ తెగతెంపులు చేసుకోవడంతో ముఫ్తీ ప్రభుత్వం మైనార్టీలోకి పడిపోయింది. మరోవైపు మెహబూబా ముఫ్తీ తన సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే జమ్మూకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తమ రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. కాశ్మీర్లో గవర్నర్ పాలన విధించాలని తాము కోరామని, అలాగే ఎక్కువ కాలం పాటు ఆ పాలన కొనసాగించరాదని చెప్పామని గవర్నర్‌‍తో భేటీ అనంతరం ఒమర్ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.