ముంబై పేలుళ్ళ కేసు : కొందరికి యావజ్జీవం... మరికొందరికి పదేళ్ళు జైలు...
ముంబై పేలుళ్ళ కేసులో ఆరుగురికి ముంబై పోటా కోర్టు బుధవారం శిక్షలను ఖరారు చేసింది. ఆరుగురు నిందితుల్లో ముగ్గురికి యావజ్జీవం.. మరో ముగ్గురుకి పదేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు ముజామ్మిల్ అన్సారీని దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పేలుళ్లతో సంబంధం ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు వాహిబ్ అన్సారీ, ఫర్హాన్ ఖోట్లకు కూడా జీవితఖైదు విధించింది. కేసులో మరో ముగ్గురు దోషులు సాఖిబ్ నచన్, అతీఫ్ ముల్లా, హసీబ్ ముల్లాలకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
ఈ కేసు విచారణలో భాగంగా గత నెల 29వ తేదీన 13 మంది నిందితుల్లో 10 మందిని దోషులుగా నిర్ధారించింది. ఆరుగురికి ఇవాళ శిక్ష ఖరారు చేయగా మిగిలిన నలుగురు ఇప్పటికే చాలాకాలం జైలులో గడిపినందున నియమాల ప్రకారం బెయిల్ పత్రాలు సమర్పిస్తే విడుదలచేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది.
కాగా, 2002 డిసెంబరు 6వ తేదీన, 2003 మార్చి 13వ తేదీన జరిగిన ముంబై పేలుళ్లలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. 2003 జనవరి 27న పేలుడులో ఓ వ్యక్తి మరణించిన విషయం తెల్సిందే. దీంతో ఈ పేలుళ్ళలో మొత్తం 13 మంది మృత్యువాతపడినట్టు అయింది.