శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2016 (09:12 IST)

నిమజ్జనంలో దారుణం : ఎస్సైని నీళ్లలో ముంచి.. చంపబోయిన యువకులు

మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబైలో వినాయక నిమజ్జనంలో ఓ దారుణం జరిగింది. నలుగురు యువకులు కలిసి ఓ పోలీస్ సబ్ఇన్‌స్పెక్టర్‌ని నీళ్ళలో ముంచి చంపబోయిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దా

మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబైలో వినాయక నిమజ్జనంలో ఓ దారుణం జరిగింది. నలుగురు యువకులు కలిసి ఓ పోలీస్ సబ్ఇన్‌స్పెక్టర్‌ని నీళ్ళలో ముంచి చంపబోయిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
స్థానిక ఠాణెలోని కల్యాణ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి గణేశ్ నిమజ్జనం కొనసాగుతుండగా కొందరు యువకులు బారికేడ్లు పెట్టి శోభాయాత్రను నిలిపివేశారని పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి దగ్గరలోనే ఉన్న కొల్సెవాడి పోలీస్‌స్టేషన్ ఎస్ఐ నితీన్ దొందు దగాలె ఘటనాస్థలికి చేరుకుని.. శోభాయాత్రను పునరుద్ధరించేందుకు ప్రయత్నించారు. 
 
దీంతో నలుగురు యువకులు ఒక్కసారిగా ఎస్ఐని చెరువులోకి తోసేశారు.. ఆ తర్వాత వారిలో ఒకడు నీళ్లలోకి దూకి ఎస్సైని నీళ్లలో ముంచుతూ పిడిగుద్దులు కురిపించాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ఎస్సై ప్రాణాలతో బయటపడ్డాడు. ఎవరూ అతడిని కాపాడే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. అయితే, అక్కడున్నవారిలో ఒకరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. 
 
దీనిపై శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడుతున్న పోలీసులకు సరైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.