శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 28 ఆగస్టు 2014 (18:26 IST)

మోడీ "జన్‌ధన్" సూపర్ హిట్.. : ఒక్క రోజే 1.50 కోట్ల బ్యాంకు ఖాతాలు!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టి గురువారం ప్రారంభించిన పీఎం జన్‌ధన్ యోజన పథకం సూపర్ డూపర్ హిట్ అయింది. ఒక్క రోజే 1.50 కోట్ల బ్యాంకు ఖాతాలను ప్రారంభించారు. గురువారం ఢిల్లీని విజ్ఞాన్ భవన్‌లో నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలు ఈ పథకాన్ని ప్రారంభించగా, ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, బ్యాంకు అధికారులు ప్రారంభించారు. 
 
దేశ వ్యాప్తంగా 76 కేంద్రాల్లో జన్ ధన్ యోజన ప్రారంభమైంది. దేశంలోని ప్రతీ కుటుంబానికి బ్యాంకు సేవలు అందాలనే లక్ష్యంతో రూపొందించిన 'ప్రధానమంత్రి జన్ ధన్ యోజన' పథకానికి విశేష స్పందన లభించింది. తొలిరోజునే కోటి యాభై లక్షల మందికి కొత్తగా బ్యాంకు ఖాతాలను ప్రారంభించారు. ఈ పథకం కింద 2018 నాటికి 7.5 కోట్ల ఇళ్లకు రెండేసి ఖాతాలైనా అందుబాటులోకి తీసుకురావాలనేది లక్ష్యంగా నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 
 
హైదరాబాద్‌లో ఈ పథకాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించగా, రాజమండ్రిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, చెన్నైలో గవర్నర్ రోశయ్య, తిరుపతిలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీథేలు పాల్గొని ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో బాగంగా తెరవనున్న ఖాతా పేరు 'జన ఖాతా'. ఒక్కో బ్రాంచ్‌లో కేవలం 175 మంది ఖాతాదారులకు మాత్రమే ఎకౌంట్ ఇస్తున్నారు. 
 
ఈ జన ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తారు. ఈ ఖాతా కలిగిన వ్యక్తి ఆరు నెలల అనంతరం ఖాతా నుండి రూ.5 వేలు రుణం పొందవచ్చు. రూ.5 వేలు రుణం తీర్చిన అనంతరం రూ.15 వేలు రుణం లభిస్తుందని చెప్పారు. అలాగే, పట్టణ, నగర ప్రాంతాల వాసులుకు రూ.2 లక్షలు, గ్రామీణ పేదలకు రూ.లక్ష వరకు ప్రమాద బీమా లభిస్తుంది.