శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2015 (13:45 IST)

మహిళపై అత్యాచారం.. రేపిస్టును కొట్టిచంపిన జనం..!

నాగాలాండ్‌లో ఓ మహిళపై అత్యాచారం చేసిన ఓ రేపిస్టును ప్రజలు నగ్నంగా ఊరేగించి, కొట్టి చంపేశారు. వివరాల్లోకి వెళితే.. నాగాలాండ్‌లో దిమాపూర్‌లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చాడని భావిస్తున్న సయ్యద్ ఫరీద్‌ఖాన్ (35) సెకండ్ హ్యాండ్ కార్ల డీలర్ ఉంటున్నాడు. ఇరవయ్యేళ్ల నాగా యువతిపై ఫరీద్‌ఖాన్ గత నెల 23, 24 తేదీల్లో వేర్వేరు ప్రదేశాల్లో అత్యాచారం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు కావడంతో ఫిబ్రవరి 25న అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
 
కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించగా ఫరీద్‌ఖాన్‌ను సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా ఈ ఘటనపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. నిందితున్ని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్‌తో సుమారు నాలుగువేల మంది గుమిగూడి గురువారం సెంట్రల్ జైలుపై దాడికి దిగారు. 
 
పటిష్ట భద్రత ఉండే జైలు గేట్లను బద్దలుకొట్టి నిందితుడైన ఫరీద్‌ఖాన్‌ను బయటికి ఈడ్చుకొచ్చి, నగ్నంగా వీధుల్లో ఊరేగిస్తూ ముఖ్యకూడలి అయిన సిటీ టవర్ వరకూ తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ పది వాహనాలకు నిప్పంటించారు. సిటీ టవర్ వద్ద ఫరీద్‌ఖాన్‌ను తీవ్రంగా కొట్టి చంపేశారు. 
 
అనంతరం పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి జనాన్ని చెదరగొట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హింస ప్రబలకుండా దిమాపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించినట్లు ఎస్పీ జమీర్ వెల్లడించారు. అయితే రేపుస్టు హత్యకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని జమీర్ తెలిపారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.