శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 నవంబరు 2015 (17:42 IST)

నిర్భయ కేసు: జువైనల్ రేపిస్ట్‌ను వదలకండి.. జ్యోతి సింగ్ పాండే పారెంట్స్

దేశ రాజధాని ఢిల్లీలో 23 ఏళ్ల యువతి జ్యోతి సింగ్ పాండే (నిర్భయ) అతి కిరాతకంగా గ్యాంగ్ రేప్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన భారత ప్రతిష్టకు ప్రపంచ స్థాయిలో మచ్చ తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో కిరాతకుడైన బాల నేరస్తుడు రిమాండ్ హో నుంచి సుమారు ఒక నెలలో బయటికి రానున్నాడు. దీంతో నిర్భయ కేసులో బాల నేరస్తుడు విడుదల కాకుండా ఉండేదుకు బాధితురాలి తల్లిదండ్రులు హెచ్చార్సీని ఆశ్రయించారు. 
 
ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. తమ కుమార్తెపై దారుణానికి ఒడిగట్టిన దోషులందరిలోనూ ఈ బాల నేరస్తుడు చాలా కిరాతకుడని పేర్కొన్నారు. అతని శిక్షా కాలం ముగియనుండటంతో వచ్చే డిసెంబరులో విడుదల చేయనున్నారు. ఇలాంటి కిరాతకుడు విడుదలైతే ప్రజల జీవితానికి, స్వేచ్ఛకు ప్రమాదకరమని ఆ వినతిపత్రంలో జ్యోతిసింగ్ పాండే తల్లిదండ్రులు పేర్కొన్నారు.  
 
నిర్భయపై దారుణానికి పాల్పడిన వారిలో రామ్ సింగ్, ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్‌లతో పాటు ఒక బాల నేరస్తుడు కూడా ఉన్నాడు. జువైనల్‌గా మూడు సంవత్సరాల శిక్షా కాలం ముగియడంతో వచ్చే డిసెంబర్‌లో ఆ బాల నేరస్తుడు విడుదల కానున్నాడు. ప్రస్తుతం అతనికి 21 సంవత్సరాలు. 
 
ఈ కుర్రాడిని సమాజంలోకి వదిలితే సమస్యలు తప్పవని.. అందుకే అతన్ని బయటికి వదలకుండా జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అతనిపై కేసు నమోదు చేసే ప్రయత్నాల్లో ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారులు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు సీనియర్ లాయర్లను కలిసి వారి అభిప్రాయాలతో పాటు సూచనలు, సలహాలను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఎన్ఎస్ఏ ప్రకారం కేసు బుక్ చేస్తే మరో ఏడాది పాటు జైలు తప్పదు.