శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 24 ఆగస్టు 2017 (09:22 IST)

సురేష్ ప్రభు రిజైన్ .. కేంద్ర రైల్వే మంత్రిగా నితిన్ గడ్కరీ?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండు వరుస రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి పదవికి సురేష్ ప్రభు రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని నియమించే అవకాశాలు కని

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండు వరుస రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి పదవికి సురేష్ ప్రభు రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, సురేష్ ప్రభు చేసిన రాజీనామాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత ఆయన స్థానంలో నితిన్ గడ్కరీని నియమించే అవకాశం ఉంది. 
 
నిజానికి మరికొద్ది రోజుల్లో కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ, విస్తరణ జరగనుండడంతో ఆ సమయంలో ఈ శాఖను భర్తీ చేయనున్నారు. దానికి వీలుగా విస్తరణకు ముందే ప్రభు రాజీనామాను ప్రధాని ఆమోదించనున్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి రైల్వే శాఖ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెల 25 నుంచి సెప్టెంబరు రెండో తేదీ మధ్య ఎప్పుడైనా కేబినెట్‌ విస్తరణ జరిగేందుకు అవకాశం ఉంది. 
 
మొత్తం 12 మంది మంత్రుల శాఖల్లో మార్పులు చోటు చేసుకోవచ్చని తెలుస్తోంది. రాజీవ్‌ ప్రతాప్‌రూడీ, చౌధరి బీరేంద్రసింగ్‌ల శాఖలను మార్చవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. ఉపేంద్ర కుష్వాహాను కేబినెట్‌ నుంచి తప్పించవచ్చని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం రక్షణ, పట్టణాభివృద్ధి, అటవీ-పర్యావరణ మంత్రిత్వ శాఖలను ఇతర మంత్రులు అదనపు బాధ్యత కింద చూస్తున్నారు. విస్తరణలో వీటికి పూర్తికాలపు మంత్రుల్ని నియమించనున్నారు. 
 
ఈ మంత్రివర్గ విస్తరణలో ఎన్డీయే గూటికి చేరిన జేడీ(యు), ఏఐఏడీఎంకేలకు ఒక్కో కేబినెట్‌ పదవి, ఒక్కో సహాయ మంత్రి పదవి అప్పగిస్తారని తెలిసింది. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కొందరు భాజపా ఎంపీలను కేబినెట్‌లో తీసుకునే అవకాశం ఉంది. అదేసమయంలో ఎన్డీయేలో వైకాపా కూడా చేరబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి వైకాపాకు కూడా కేంద్ర మంత్రిపదవులు కట్టబెడుతారో లేదో వేచి చూడాల్సి ఉంది.