శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Modified: శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (08:58 IST)

నో.. కామెంట్.. ఎన్ కౌంటర్ పై తమిళ మీడియాకు గవర్నర్ సమాధానం

శేషాచల ఎన్ కౌంటర్ పై స్పందించాలంటూ పట్టుబట్టిన తమిళ మీడియాకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. ఎంత ఒత్తిడి చేసినా ఆయన నో కామెంట్ అనడం మినహా మరో సమాధానం చెప్పలేదు. చివరకు భద్రతా సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు మధ్యన గొడవ జరిగింది. 
 
తిరువళ్లూరులోని ప్రసిద్ధ ఆలయం వీరరాఘవ స్వామి దర్శనం కోసం 3 నెలలకోసారి ఆయన వస్తుంటారు. ఈ క్రమంలో గురువారం తన సతీమణితో వచ్చిన ఆయనను దర్శనానంతరం మీడియా ప్రతినిధులు చుట్టముట్టారు. ఎన్‌కౌంటర్‌పై మాట్లాడాలని పట్టుబట్టారు. దీంతో ఆయన తల ఊపుతూ ముందుకు కదిలారు. 
 
అయితే, మీడియా మాత్రం మాట్లాడాలని కోరింది. దీంతో ఆగ్రహించిన భద్రతా సిబ్బంది మీడియాను తోసేశారు. దీంతో మీడియా ప్రతినిధులకు, భద్రతా సిబ్బందికి మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది. అనంతరం, తిరుగు ప్రయాణమవుతున్న గవర్నర్‌ను మీడియా ప్రతినిధులు మరోసారి చుట్టముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో నిమిషం పాటు ఆలోచించిన గవర్నర్.. ‘నో కామెంట్.. నో కామెంట్’ అంటూ వెళ్లిపోయారు.