శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (10:38 IST)

పన్నీర్ చాప్టర్ క్లోజ్.. మన్నార్‌గుడి ఫ్యామిలీ గుప్పిట అన్నాడీఎంకే.. శశికళదే పైచేయి..

తమిళనాట చిన్నమ్మ బండారాన్ని బయటపెట్టిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం చాప్టర్ క్లోజ్ అని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అంటున్నారు. శశివర్గానికి చెందిన నేతలు పన్నీర్‌ను ఇక పార్టీలోకి చేర్చుకునే అవకాశం లేదంటున్నారు

తమిళనాట చిన్నమ్మ బండారాన్ని బయటపెట్టిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం చాప్టర్ క్లోజ్ అని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అంటున్నారు. శశివర్గానికి చెందిన నేతలు పన్నీర్‌ను ఇక పార్టీలోకి చేర్చుకునే అవకాశం లేదంటున్నారు.

ముఖ్యమంత్రిగా శశికళ నమ్మినబంటు ఎడపాడి పళనిస్వామి ఎన్నిక కావడం, ప్రమాణ స్వీకారం కోసం ఆయనను గవర్నర్‌ ఆహ్వానించడంతో.. ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌ సెల్వం ఆడుతున్న రాజకీయ చదరంగానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్టు అయింది.
 
జయలలితకు నమ్మినబంటు అయిన పన్నీర్‌ సెల్వం.. చిన్నమ్మ కోసం సీఎం పదవికి రాజీనామా చేసి.. ఆ వెంటనే తిరుగుబాటుతో రాజకీయ డ్రామాకు తెరలేపారు. సెల్వానికి మొదట అనూహ్య మద్దతు లభించింది. అమ్మ సమాధి వద్ద మౌనదీక్షతో ఆయన ప్రారంభించిన ఈ డ్రామా తమిళనాట తీవ్ర ఉత్కంఠ రేపింది.

తన వ్యూహాలతో, ఎత్తులు-పైఎత్తులతో కొంతవరకు అన్నాడీఎంకే నేతలను చీల్చగలిగిన సెల్వం.. శశికళపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు.

ఆయన ఎంత ఒత్తిడి చేసినా మన్నార్‌గుడి కుటుంబం గుప్పిటను దాటి ఎమ్మెల్యేలు రాలేకపోయారు. ఇప్పటికే అన్నాడీఎంకేలో శశికళ కుటుంబానిదే ఆధిపత్యం. ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి ఉండొచ్చునని భావిస్తున్నారు. 
 
ప్రస్తుతానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోలేకపోయిన సెల్వం.. భవిష్యత్తులో ఆ పార్టీకి వ్యతిరేక గళంగా కొనసాగుతూ పుంజుకునే అవకాశముంది. మరోవైపు పన్నీర్‌ సెల్వం మద్దతుదారులు తమ వర్గాన్ని ఐక్యంగా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది.