శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 6 మార్చి 2017 (04:40 IST)

అమ్మ ఆరోగ్యంపై విచారణ జరిగితే మొదట చిక్కుకునేది తమరే పన్నీర్: ఆరోగ్య మంత్రి ఝలక్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సి.విజయభాస్కర్ భారీ ఝలక్ ఇచ్చారు. అధికారంలో ఉన్నంత వరకూ అమ్మ జయలలిత మరణంపై ఎలాంటి అనుమానాలు లేవనెత్తని ఆమె వీర విధేయుడు పన్నీర్ సెల్వం.. అధికారం నుంచి తప్పుకోవాల్సి రావడంతో విమర్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సి.విజయభాస్కర్ భారీ ఝలక్ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై దర్యాప్తు కోసం పోరాడుతున్న పన్నీర్ సెల్వం నేటి సాయంత్రం తన మద్దతుదారులతో సమావేశం కాగా, మరోవైపు అన్నాడీఎంకే అధికార వర్గ నేతలు పన్నీర్ పై విరుచుకు పడుతున్నారు. మంత్రి విజయభాస్కర్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నంత వరకూ అమ్మ జయలలిత మరణంపై ఎలాంటి అనుమానాలు లేవనెత్తని ఆమె వీర విధేయుడు పన్నీర్ సెల్వం.. అధికారం నుంచి తప్పుకోవాల్సి రావడంతో విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు.

 
అపోలో ఆస్పత్రిలో జయకు ఎలాంటి చికిత్స అందించారన్న విషయంలో సీఎం పదవిలో ఉండగా పన్నీర్ సెల్వానికి ఎందుకు గుర్తురాలేదో చెప్పాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు. అమ్మకు అందించిన ట్రీట్‌మెంట్, ఆమె మృతిపై అధికారం కోల్పోయిన క్షణం నుంచి పన్నీర్ వదంతులు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో ఏదైనా తప్పు అని తేలితే మాత్రం తొలి దోషి మాత్రం మాజీ సీఎం పన్నీరే అవుతారని, అందరికీ ఆయనే జవాబు చెప్పాల్సి ఉంటుందని విజయభాస్కర్ వ్యాఖ్యానించారు.   
 
మరోవైపు పన్నీర్ సెల్వం భవిష్యత్ కార్యాచరణపై తన నివాసంలో ఆదివారం సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జయలలిత మృతిపై దర్యాప్తు చేపట్టకపోతే మార్చి 8న తన మద్దతుదారులు, పార్టీ నేతలతో కలిసి నిరాహార దీక్షకు దిగుతానని పన్నీర్ సెల్వం హెచ్చరించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలైన అన్నాడీఎంకే తమదేనని ఓపీఎస్ వర్గం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి సి.విజయభాస్కర్ మాజీ సీఎం పన్నీర్ అధికారం కోసం కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.