శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 మార్చి 2018 (13:26 IST)

దద్ధరిల్లిన పార్లమెంట్.. ఇదేం బజారు కాదంటూ వెంకయ్య ఆగ్రహం

విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మంగళవారం చేపట్టిన ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్ధరిల్లిపోయాయి. దీంతో రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్య

విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మంగళవారం చేపట్టిన ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్ధరిల్లిపోయాయి. దీంతో రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదేం బజారు కాదంటూ తెలుగు ఎంపీలపై మండిపడ్డారు. అయినప్పటికీ వారు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ఉభయ సభలు వాయిదాపడ్డాయి. 
 
బడ్జెట్ మలివిడత సమావేశాలు ప్రారంభమైన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు వివిధ అంశాలపై ఆందోళనకి దిగారు. రిజర్వేషన్లు పెంచుకునే హక్కు రాష్ట్రాలకు ఉండాలంటూ తెరాస ఎంపీలు డిమాండ్ చేశారు. వాయిదా తీర్మానం ఇచ్చారు. చర్చకు స్పీకర్ తిరస్కరించటంతో పోడియం ఎదుట నినాదాలు చేశారు. రాష్ట్రాల హక్కును హరిస్తున్నారంటూ నినాదాలు చేశారు. 
 
తెరాస ఎంపీలకితోడు ఏపీ ఎంపీలు కూడా నిరసనకి దిగారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు స్పీకర్ పోడియం ఎదుట ప్లకార్డులతో నిరసన చేపట్టారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంపై కాంగ్రెస్ కూడా చర్చకు పట్టుబట్టింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. వివిధ రాష్ట్రాల ఎంపీల ఆందోళనతో లోక్‌సభ దద్ధరిల్లింది. రెండుసార్లు వాయిదా వేసిన సభ అదుపులోకి రాకపోవటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ రేపటికి వాయిదావేశారు.