శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 జనవరి 2018 (11:16 IST)

తల్లిని టెర్రస్ పైనుంచి కిందకు తోసి చంపిన 'ప్రొఫెసర్' కొడుకు (వీడియో)

నవమాసాలు పెంచిపోషించిన తల్లి అనారోగ్యానికిగురై మంచానపడటంతో ఆమెకు సేవ చేయలేక విసిగిపోయిన ప్రొఫెసర్ కుమారుడు... మేడపై నుంచి కిందికి తోసేసి చంపేశాడు. ఆరోగ్యం కోసం ఎండలో కూర్చోబెడ‌తాన‌ని త‌న త‌ల్లిని అపార్ట్‌మెంట్‌పైకి తీసుకెళ్లిన ఆ కొడుకు అక్క‌డి నుంచి ఆమెను కిందకు తోసేసి హ‌త్య చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తంకావడంతో చివ‌ర‌కు అడ్డంగా దొరికిపోయాడు. ఈ దారుణం రాజ్‌కోట్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుజరాత్‌ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లోని గాంధీగ్రామ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో సందీప్ అనే వ్యక్తి ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ఈయన తల్లి జై శ్రీబెన్. వృద్దాప్యంతో పాటు.. అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంది. ఈమె మూడు నెల‌ల క్రితం అపార్ట్‌మెంట్‌పై నుంచి ప‌డి మృతి చెందింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంద‌ని భావించిన పోలీసులు ఈ కేసును క్లోజ్ చేశారు. 
 
అయితే, ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి తాజాగా రాజ్‌కోట్ పోలీసులకు ఓ లేఖ రాసి, సీసీటీవీ ఫుటేజీని కూడా అందించాడు. దీంతో ఈ కేసులో మ‌ళ్లీ ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సందీప్‌ను అరెస్టు చేశారు. పోలీసుల‌ విచార‌ణ‌లో మొద‌ట అస‌త్యాలు చెప్పిన‌ సందీప్ ఆ తర్వాత తమదైనశైలిలో విచారించడంతో చేసిన నేరాన్ని అంగీకరించాడు. తన తల్లికి ఆరోగ్యం బాగో లేక‌పోవ‌డంతో ఆమెను ఆసుప‌త్రుల చుట్టూ తిప్ప‌లేక‌ విసిగిపోయాన‌ని, అందుకే హ‌త్య చేశాన‌ని చెప్పాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు త‌దుపరి విచార‌ణ‌ను కొన‌సాగిస్తున్నారు.