గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 29 డిశెంబరు 2017 (18:47 IST)

అమ్మను చంపేసి తాపీగా ఐస్ క్రీమ్ తింటూ టీవీ చూశాడు... ఎందుకో తెలుసా?

కొన్ని దురలవాట్లకు లోనైన కొంతమంది యువత ఆ అలవాట్లు నెత్తికెక్కినప్పుడు ఏం చేస్తారో వారికే తెలియదు. చివరికి కన్నతల్లిదండ్రులని కూడా చూడకుండా హత్యలకు పాల్పడుతున్న దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా కేరళలో ఓ యువకుడు చేసిన ఘాతుకం అందరినీ షాక్‌కి గురిచేసి

కొన్ని దురలవాట్లకు లోనైన కొంతమంది యువత ఆ అలవాట్లు నెత్తికెక్కినప్పుడు ఏం చేస్తారో వారికే తెలియదు. చివరికి కన్నతల్లిదండ్రులని కూడా చూడకుండా హత్యలకు పాల్పడుతున్న దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా కేరళలో ఓ యువకుడు చేసిన ఘాతుకం అందరినీ షాక్‌కి గురిచేసింది.
 
వివరాల్లోకి వెళితే... అశోక్, దీపా ఇద్దరు దంపతులు. వారికి ఇద్దరు సంతానం. గత 17 ఏళ్లుగా వారు కేరళలోని తిరువనంతపురం అంబలముక్కులోని మన్నాడి లేన్‌లో నివాసముంటున్నారు. దీప భర్త ఉద్యోగం నిమిత్తం మస్కట్లో వుంటుండగా కుమార్తెకు పెళ్లి చేశారు. 23 ఏళ్ల కుమారుడు అక్షయ్, 50 ఏళ్ల దీప ఇద్దరు మాత్రమే ఆ ఇంట్లో వుంటున్నారు. ఈ క్రమంలో మొన్న క్రిస్మస్ పండుగ తర్వాత దీప కనిపించకుండా పోయింది. 
 
ఏం జరిగిందో తెలుసుకుని పోలీసులు కూడా షాకయ్యారు. అక్షయ్ కన్నతల్లిని అతి కిరాతకంగా హతమార్చి ఆమె శవాన్ని కిరోసిన్ పోసి నిప్పంటించి బూడిద చేశాడు. క్రిస్మస్ రోజున తల్లీకొడుకుల మధ్య వివాదం చెలరేగింది. తనకు డబ్బు కావాలంటూ అక్షయ్ ఆమెతో గొడవపడ్డాడు. ఎంతకీ తను ఇవ్వననేసరికి బెడ్రూంలో వున్న దుప్పటి తీసుకుని ఆమెకు ఊపిరాడకుండా చేసి చంపేశాడు. 
 
ఆ తర్వాత ఆమె మృత దేహాన్ని ఇంటి వెనుకకు తీసుకెళ్లి, అక్కడే వున్న చెత్తచెదారంతోపాటు కొన్ని పుల్లలు చేర్చి కిరోసిన్ పోసి ఆమె దేహాన్ని తగులబెట్టాడు. చుట్టుపక్కలవాళ్లకి శవం కాలుతున్న వాసన వచ్చినప్పటికీ పండుగ సందడిలో అదేమీ పట్టించుకోలేదు. తల్లిని చంపి నిప్పు పెట్టిన అక్షయ్, ఇంట్లోకెళ్లి తాపీగా టీవీ ఆన్ చేసి ఐస్ క్రీం తింటూ ఎంజాయ్ చేశాడు. అంతేకాదు... ఆరోజే తన స్నేహితుడిని పిలిచి అతడితో కలిసి పిచ్చాపాటి మాటలు చెపుతూ ఉదయం నుంచి తన తల్లి కనబడటం లేదంటూ దొంగమాటలు చెప్పాడు. ఆ తర్వాత అతడే వెళ్లి తన తల్లి ఆచూకి లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
దర్యాప్తు చేసిన పోలీసులు హంతకుడు అక్షయేననే నిర్థారణకు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. తొలుత తన తల్లిని తను హత్య చేయలేదని వాదించాడు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసేసరికి అసలు విషయం చెప్పాడు. తనకు డ్రగ్స్ అలవాటు వున్నదనీ, పైగా తన తల్లి ఎవరితోనో అక్రమ సంబంధం సాగిస్తుందంటూ చెప్పుకొచ్చాడు. తనకు డబ్బు కావాలంటే ఇవ్వలేదన్న కోపంతో ఆమెను చంపేసినట్లు అంగీకరించాడు. ఐతే అతడు అంత క్రూరంగా తల్లిని హత్య చేశాడంటే ఇరుగుపొరుగువారు షాక్ తింటున్నారు. కానీ డ్రగ్స్ బానిసగా మారిన అతడిలో క్రూరమృగం దాగున్నదనీ, ఫలితంగా అతడు తన కన్నతల్లి అన్న విషయాన్ని కూడా మరిచి హత్య చేసాడని పోలీసులు వెల్లడించారు.