సయీద్ మనస్సు మార్చేందుకే వైదిక్ భేటీ : రాందేవ్
లష్కరే తోయిబా తీవ్రవాదం సంస్థ అధినేత హఫీజ్ సయీద్ మనస్సు మార్చేందుకే తన అనుచరుడు వేద ప్రతాప్ వైదిక్ సమావేశమయ్యారని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అభిప్రాయపడ్డారు. ముంబై పేలుళ్ల సూత్రదారి సయీద్ హఫీజ్తో జర్నలిస్టు వైదిక్ సమావేశం కావడం దేశీయంగా పెను వివాదానికి దారితీసిన విషయం తెల్సిందే. దీనిపై రామ్దేవ్ బాబా స్పందించారు. తన అనుచరుడు వేద ప్రతాప్ వైదిక్కు అండగా నిలిచారు. వేద ప్రతాప్ వైదిక్ జమాతే ఉద్ దవా చీఫ్ సయీద్ హఫీజ్ మనసును మార్చేందుకు ప్రయత్నించారని తాను గట్టిగా నమ్ముతున్నానని ట్వీట్ చేశారు.
వేద ప్రతాప్ వైదిక్ ఓ విలేకరి అని, ఆయన ఎవరినైనా కలవవచ్చునని బాబా రామ్దేవ్ అభిప్రాయపడ్డారు. కాగా, ఫ్రీలాన్స్ జర్నలిస్టు వేద్ ప్రతాప్ వైదిక్ జమాతే ఉద్ దవా చీఫ్ సయీద్ హఫీజ్ను ఈ నెల 2వ తేదీన లాహోర్లో కలిశాడు. పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆహ్వానం మేరకు పాకిస్థాన్లో పర్యటించిన జర్నలిస్టులు, రాజకీయ నాయకుల బృందంలో వైదిక్ ఉన్నారు. వారిద్దరి మధ్య జరిగిన సమావేశానికి సంబంధించిన ఫొటోగ్రాఫ్ సోషల్ మీడియాలో సందడి చేసింది. దీంతో వైదిక్ విషయంపై కాంగ్రెస్ బీజేపీపై విరుచుకుపడింది.
కాగా, ఈ సమావేశంపై వైదిక్ కూడా వివరణ ఇచ్చారు. హఫీజ్ సయీద్ను జర్నలిస్టుగా మాత్రమే కలిశానని వేద్ ప్రతాప్ వైదిక్ స్పష్టం చేశారు. తన భేటీ వెనుక ప్రభుత్వ ప్రమేయం లేదని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. పాకిస్థాన్లో హాఫీజ్ సయీద్తో జర్నలిస్ట్, రాందేవ్ బాబా అనుచరుడు వేదప్రతాప్ వైదిక్ కలవటంపై రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు తప్పుబట్టిన విషయం తెలిసిందే. దీనిపై వేద్ ప్రతాప్ వైదిక్ పై విధంగా స్పందించారు.