లలిత్ మోడీపై ఢిల్లీ పోలీసు కమిషనర్కు రాష్ట్రపతి భవన్ ఫిర్యాదు
గత కొన్ని రోజులుగా వివాదాస్పద ట్వీట్లతో సంచలనం రేపుతున్న వివాదాస్పద వ్యాపారి, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసు కమిషనర్కు రాష్ట్రపతి భవన్ ఫిర్యాదు చేసింది. దీంతో ఢిల్లీ పోలీసులు లలిత్ మోడీపై కేసు నమోదు చేశారు.
లండన్లో ప్రవాస జీవితం గడుపుతున్న లలిత్ మోడీ వివాదాస్పద ట్వీట్స్తో రోజుకో ప్రముఖుడిని వివాదంలోకి లాగుతున్న విషయంతెల్సిందే. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఒమితా పాల్ నుంచి పారిశ్రామికవేత్త వివేక్ నగ్పాల్ అయాచిత లబ్ధిపొందారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా రాష్ట్రపతి, ఆయన కార్యదర్శి ఫొటోలతో 80 పేజీల ఈడీ దర్యాప్తు ప్రతిని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
దీనిపై రాష్ట్రపతి కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. వివాదాస్పద ట్వీట్స్ చేసిన ఆయనపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీకి ఆదివారం ఫిర్యాదుచేసింది. లలిత్ మోడీ ట్విట్టర్ అకౌంట్ను కూడా బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. లలిత్ మోడీ ఆరోపణలను అప్పుడే ఖండించిన రాష్ట్రపతి భవన్, తాజాగా పోలీసులకు ఫిర్యాదుచేసింది. దానిని బస్సీ ఆర్థిక నేరాల విచారణ విభాగానికి పంపారు.