శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2016 (12:24 IST)

ముఖేష్ అంబానీ ప్రకటనతో రూ.3వేల కోట్ల పతనం: 3 నెలల్లో 900 కోట్ల జియో కాల్స్‌ బ్లాక్ చేశాయట..!

ప్రముఖ వ్యాపార వేత్త ,రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మొబైల్ డేటా రంగంలో కొత్తగా ప్రవేశపెట్టిన జియో ఆఫర్‌ను పొడిగిస్తూ గురువారం 25 నిమిషాల పాటు చేసిన ప్రసంగంతో దేశంలోని ప్రత్యర్థి టెలికాం

ప్రముఖ వ్యాపార వేత్త ,రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మొబైల్ డేటా రంగంలో కొత్తగా ప్రవేశపెట్టిన జియో ఆఫర్‌ను పొడిగిస్తూ గురువారం 25 నిమిషాల పాటు చేసిన ప్రసంగంతో దేశంలోని ప్రత్యర్థి టెలికాం కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. ఈ పతనం మొత్తం విలువ సుమారు రూ.3వేల కోట్లు అని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
భారతీయ టెలికాం రంగంలో ‘రిలయన్స్‌ జియో’ రాక టెలికామ్ రంగాన్ని ఓ ఊపు ఊపేసింది. డిసెంబర్‌ 30 వరకు ఉచిత వాయిస్‌ కాల్స్‌, డేటా ఆఫర్‌ను ప్రకటించడంతో ఆ నెట్‌వర్క్‌ సిమ్‌ల కోసం జనాలు బారులు తీరారు. తాజాగా ఈ ఆఫర్‌ను ‘హ్యాపీ న్యూ ఇయర్‌’గా నామకరణం చేసి 2017 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. పాత చందాదారులకూ ఇది వర్తిస్తుందని అని ముకేశ్‌ అంబానీ చేసిన ప్రకటన తో దేశీయ మార్కెట్లో ముఖ్యంగా ప్రత్యర్థి టెలికాం షేర్ల పాలిట శాపమైంది. ఫలితంగా ఐడియాతో ఇతర టెలికాం కంపెనీల షేర్లు పడిపోయాయి. 
 
మరోవైపు ముఖేష్ అంబానీ పనిలో పనిగా తన ప్రసంగంలో ఇతర టెలికాం సంస్థలపై చిర్రుబుర్రుమన్నారు. ఎయిర్‌టెల్‌, ఐడియా, వోడాఫోన్‌లు జియోకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా జియో నుండి వచ్చే కాల్స్‌ను తమ కస్టమర్లకు కనెక్ట్‌ చేయకుండా అడ్డుకుంటున్నాయన్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎయిర్‌టెల్‌, ఐడియా, వోడాఫోన్‌లు దాదాపుగా 900 కోట్ల జియో కాల్స్‌ను బ్లాక్‌ చేయడం జరిగిందని, పోటీ తత్వం తట్టుకోలేక ఇలాంటి పనులు వారు చేస్తున్నట్లుగా ముఖేష్‌ అంబానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల్లోనే 900 కోట్ల కాల్స్‌ను బ్లాక్‌ చేసిన ఆ కంపెనీలు ఇకపై అయినా తమ తప్పుడు ప్రవర్తనను సరిదిద్దుకోవాలని కోరారు.