శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (09:08 IST)

'రైజింగ్ కాశ్మీర్' పత్రిక ఎడిటర్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదులు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. స్థానిక శ్రీనగర్‌లో ఉన్న రైజింగ్ కాశ్మీర్ పత్రిక ఎడిటర్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ దారుణం ఆ పత్రికా కార్యాలయం ఎదుటే జరిగింది. ఆయన పేరు షుజాత్‌ బుఖారీ. ఈయన

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. స్థానిక శ్రీనగర్‌లో ఉన్న రైజింగ్ కాశ్మీర్ పత్రిక ఎడిటర్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ దారుణం ఆ పత్రికా కార్యాలయం ఎదుటే జరిగింది. ఆయన పేరు షుజాత్‌ బుఖారీ. ఈయన కాశ్మీర్ శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
గురువారం సాయంత్రం ఇఫ్తార్ విందుకు వెళ్లేందుకు కార్యాలయం నుంచి బయటకు రాగానే అక్కడే కాపుకాసిన ఉగ్రవాదులు అతిసమీపం నుంచి షుజాత్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడంతో ఆయన అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఆయన సెక్యూరిటీ గార్డు, వాహన డ్రైవర్‌పైనా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 
 
షుజాత్ హత్య విషయం తెలియగానే జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. షుజాత్ హత్యను ఎడిటర్స్ గిల్డ్ ఖండించింది. కాశ్మీరులో విధులు నిర్వర్తించడం జర్నలిస్టులకు పెనుసవాలుగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. జర్నలిస్టులకు భద్రత కల్పించాలంటూ కశ్మీర్ ప్రభుత్వాన్ని కోరింది. 
 
శ్రీనగర్‌కు చెందిన షుజాత్ గతంలో హిందూ పత్రిక శ్రీనగర్ బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. ప్రస్తుతం కశ్మీర్ మీడియాలో ప్రముఖులుగా ఉన్నవాళ్లలో చాలామంది ఆయన వద్ద పనిచేసిన వారే. షుజాత్ గతంలోనూ మూడుసార్లు ఉగ్రవాదుల బారి నుంచి త్రుటిలో తప్పించుకోవడం గమనార్హం. 
 
ఉగ్రవాదుల దుశ్చర్యను పార్టీలకతీతంగా దేశంలోని నేతలంతా ఖండించారు. షుజాత్ హత్య హేయమని సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. ఇది పిరికిపంద చర్య అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించగా, షుజాత్‌ హత్య తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు.