గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2017 (17:06 IST)

అమ్మకు కుమార్తె ఉంది.. నిజం వారిద్దరికే తెలుసంటున్న జయ అన్న

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలితకు ఒక కుమార్తె ఉందనీ, ఆ విషయం శశికళకు, ఆమె భర్త నటరాజన్‌కు మాత్రమే తెలుసని జయలలిత అన్న వాసుదేవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలితకు ఒక కుమార్తె ఉందనీ, ఆ విషయం శశికళకు, ఆమె భర్త నటరాజన్‌కు మాత్రమే తెలుసని జయలలిత అన్న వాసుదేవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను జయలలిత కుమార్తెనంటూ అమృతా అనే యువతి, ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించుకోవచ్చని ప్రకటించింది. అంతటితో ఆగని ఆ మహిళ.. ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో జయలలితకు కుమార్తె ఉందా? లేదా? అనే అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో బెంగుళూరులో నివశించే జయలలిత అన్న వాసుదేవన్ మాట్లాడుతూ, తన తండ్రి జయరామన్.. వేదమ్మాళ్ అలియాస్ సంధ్య అనే మహిళను రెండో వివాహం చేసుకున్నట్టు చెప్పారు. వారిద్దరికీ పుట్టిన బిడ్డే జయకుమార్, జయలలిత. ఆ ప్రకారంగా జయలలిత తనకు చెల్లెలు అవుతుందని తెలిపారు. ఆ తర్వాత జయలలిత అమ్మ సంధ్య సినీ రంగానికి చెందిన ఆర్ట్స్ డైరెక్టర్ దామోదరపిళ్లై అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుందనీ, వీరికి శైలజ అనే కుమార్తె ఉన్నట్టు తనకు తెలిసిందన్నారు. అయితే, ఆమెను తాను కలుసుకోలేక పోయానని తెలిపారు. 
 
కానీ, తన గురించి తెలుసుకున్న శైలజ.. ఆమె దత్తపుత్రుడు ఒకరోజున తనను వెతుక్కుంటూ బెంగుళూరు ఇంటికి వచ్చినట్టు చెప్పారు. వారి చెప్పిన మాటల ప్రకారం జయలలిత చెల్లెలు శైలజ అని నిర్ధారించుకున్నట్టు తెలిపారు. ఆ తర్వాత తమ రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు నెలకొని రాకపోకలు సాగాయన్నారు. పిమ్మట అనారోగ్యం కారణంగా శైలజ, ఆమె భర్త పార్థసారథిలు కన్నుమూశారని చెప్పారు. 
 
అయితే, చిత్రసీమలో ఉన్నపుడు తెలుగు హీరో శోభన్ బాబుకు, జయలలితలకు ఒక కుమార్తె పుట్టిందనీ, ఆమెను విదేశాల్లోనే స్థిరపడేలా చర్యలు తీసుకున్నట్టు తనకు తెలిసిందన్నారు. అయితే, దీనికి సంబంధించిన నిజానిజాలన్నీ శశికళ, నటరాజన్‌లకు మాత్రమే తెలుసన్నారు. వారిద్దరే ఈ విషయంలో పూర్తి క్లారిటీ ఇవ్వగలరని చెప్పారు. జయ కుమార్తెను తానేనని అమృత ప్రకటించిన తర్వాత లలితతో పాటు, వాసుదేవన్‌లు ఇదే విషయంపై మాట్లాడటం ఇపుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది.