శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 27 మే 2015 (12:38 IST)

నరేంద్ర మోడీ పాలన ఓ సెల్ఫీ : బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యేడాది పాలనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఘాటైన విమర్శలు చేశారు. మోడీ పాలన సెల్ఫీ పాలన (వ్యక్తి కేంద్రంగా)గా అభివర్ణించారు. భారత్‌ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి సెల్ఫ్‌లెస్ (నిస్వార్థ) నేత పాలన కావాలన్నారు. కానీ, మోడీ మాత్రం సెల్ఫీ పాలన కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ‘కేంద్ర కేబినెట్‌లోని మంత్రులందరూ తీసుకున్న సెల్ఫీల కంటే.. ఈ ఏడాదిలో పాలనలో ప్రధాని మోడీ దిగిన సెల్ఫీలే ఎక్కువగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వీనుల విందుగా అనిపించే మాటలతో పేద ప్రజలకు ఒనగూరేది ఏమీ లేదు. ఓ గృహిణి, నిరుద్యోగి, రైతు, ఉద్యోగి, చేతిపనివాడు, విద్యావేత్త.. ఏడాది క్రితం మోడీకి ఓటేసిన ప్రతి ఒక్క ఓటరు ఇలా ఎవరిని అడిగినా ఈ ఏడాది పాలనలో మోడీ సర్కార్‌ తమకు ఏమీ చేయలేదని కచ్చితంగా చెబుతారన్నారు. 
 
ఇక రాష్ట్రాల పర్యటనల కంటే.. ఎక్కువ సంఖ్యలోనే మోడీ విదేశాల్లో పర్యటించారు. విదేశాంగ ప్రతినిధులు కూడా అన్ని దేశాల్లో పర్యటించి ఉండరు. మోడీ పాలనలో పాకిస్థాన్‌, చైనాతో ఉన్న సరిహద్దు వివాదాలు మరింత ముదిరాయి. పేదల కోసం ఆయన ఏమీ చేయలేదు. అసలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ఇంతవరకూ నెరవేర్చలేదన్నారు.