శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2017 (14:01 IST)

రెండాకుల్ని సొంతం చేసుకుంటాం.. శశి వర్గాన్ని కలుపుకుని పోతాం.. ఓపీఎస్ ప్రకటన

దివంగత ముఖ్యమంత్రి జయలలిత తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడంతో అన్నాడీఎంకే ఇరు వర్గాలుగా చీలిపోయింది. ఇందులో ఒక వర్గం శశికళకు జై కొడితే, మరో వర్గం పన్నీరు వెంట నిలిచింది. అయితే శశికళ వర్గానికి ఆర్కే నగర్

దివంగత ముఖ్యమంత్రి జయలలిత తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడంతో అన్నాడీఎంకే ఇరు వర్గాలుగా చీలిపోయింది. ఇందులో ఒక వర్గం శశికళకు జై కొడితే, మరో వర్గం పన్నీరు వెంట నిలిచింది. అయితే శశికళ వర్గానికి ఆర్కే నగర్ ఎన్నికల ద్వారా ఈసీ చుక్కలు చూపించింది.

ఆర్కేనగర్ ఎన్నికల్లో డబ్బును నీరులా దారపోశారంటూ.. ఆధారాలు లభించడంతో పాటు.. రెండాకుల చిహ్నాన్ని దక్కించుకునేందుకు టీటీవీ దినకరన్ లంచం ఇవ్వజూపాడని ఆరోపణలకు ఆధారాలు లభించడంతో శశివర్గానికి చెక్ పెట్టినట్టైంది. దీంతో దినకరన్‌ కూడా అరెస్టయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.
 
ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలు ఇరువర్గాలుగా చీలిపోయిన తరుణంలో శశికళ వర్గీయులు తమను సంప్రదిస్తే వారిని కలుపుకుని పోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం ప్రకటించారు. దినకరన్, శశికళతో పెట్టుకుంటే పార్టీ భవితవ్యం గంగలో కలిసిపోతుందని.. రెండాకుల చిహ్నాన్ని దక్కించుకుని పార్టీకి జీవం పోయాలంటే.. చిన్నమ్మను పక్కనబెట్టేయాలని పన్నీర్ తెలిపారు. అమ్మ ఆశయాలను నెరవేర్చే పార్టీ తమదేనని ఓపీఎస్ చెప్పారు. ఆర్కేనగర్‌లో రూ.89 కోట్లను బట్వాడా చేసినట్లు ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం ఆ ఎన్నికలను రద్దు చేసింది. 
 
మంత్రి విజయ భాస్కర్ ఇంట్లో ఆదాయ పన్ను శాఖాధికారులు చేసిన తనిఖీలో ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా లభించాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు ఏకమైతేనే పార్టీకి తమిళనాట భవిష్యత్తు ఉంటుందని.. దినకరన్, శశికళను అన్నాడీఎంకే నుంచి దూరంగా పెడితే మంచిదని పన్నీర్ తెలిపారు.

ఈ మేరకు సోమవారం ఓపీఎస్ మీడియాతో మాట్లాడుతూ.. రెండాకుల చిహ్నంపై ఎన్నికల సంఘం విచారణ జరుపుతోందని.. ఈ చిహ్నం తమకే దక్కుతుందని నమ్మకముందన్నారు. అయితే శశికళ వర్గీయులు తమను సంప్రదిస్తే.. వారితో చర్చించి కలుపుకుని పోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.