ఏంటి..? యాకూబ్ భార్యకు రాజ్యసభ సీటా? ఫరూఖ్ గోసీపై వేటు
యాకూబ్ మెమన్ భార్యకు రాజ్యసభ సీటు ఇవ్వాలంటూ లేఖ రాసిన మహారాష్ట్ర సమాజ్ వాదీ విభాగం ఉపాధ్యక్షుడు మహ్మద్ ఫరూఖ్ గోసీపై పార్టీ నిషేధం వేటు వేసింది. పార్టీలోని అన్ని పదవుల నుంచి ఆయనను తొలగించారు. అంతేగాకుండా గోసీని సమాజ్ వాదీ పార్టీ నుంచి ఆయనను తొలగించే ఛాన్సుందని వార్తలొస్తున్నాయి.
ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అబూ అసిం అజ్మీ మాట్లాడుతూ, గోసీ లేఖపై వివరణకోరే అవకాశముందని చెప్పారు. అతని వ్యాఖ్యలపై పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఓ ప్రకటనలో సమాజ్ వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ స్పష్టం చేశారు.
కాగా ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ ఉరికంబం ఎక్కడంతో.. అతని భార్య రహీన్ ప్రస్తుతం నిస్సహాయురాలిగా మిగిలిపోయింది. 1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో రహీన్ కూడా కొంతకాలం జైల్లో గడిపింది. ఆమె పాత్రపై ఆధారాల్లేకపోవడంతో కోర్టు విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో ఆమెను రాజ్యసభ సీటివ్వాలని సమాజ్ వాదీ పార్టీ మహారాష్ట్ర విభాగం ఉపాధ్యక్షుడు మహ్మద్ ఫరూఖ్ ఘోసీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్కు లేఖ రాయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.