శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (13:48 IST)

రాజపక్షేకు భారతరత్న ఇవ్వాలంటూ మోడీకి స్వామి లేఖ!

శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సేకు భారత రత్న అవార్డు ఇవ్వాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బీజేపీ సీనియర్ నేత డాక్టర్ సుబ్రమణ్య ఓ లేఖ రాశారు. భారత అంతర్గతభద్రతకు పెనుముప్పుగా మారిన ఎల్టీటీఈని రాజపక్సే సమర్థవంతంగా మట్టుబెట్టారని చెప్పారు. 
 
సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఈ విజ్ఞప్తి ఎల్టీటీఈని అభిమానించే తమిళులకు ఆగ్రహం తెప్పించే విషయమైనప్పటికీ.. ఆయన మాత్రం గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. దీంతో కత్తి సినిమానే వదిలిపెట్టేందుకు తమిళ తంబీలు ఇష్టపడని నేపథ్యంలో.. సుబ్రహ్మణ్య స్వామి కూడా తమిళ బ్రదర్స్ కోపానికి పాత్రుడు అవుతారని సమాచారం. ఇటీవల తమిళ జాలర్లను, వారి బోట్లను శ్రీలంక రక్షణ సిబ్బంది నిర్బంధించిన నేపథ్యంలో జాలర్లను విడిచిపెట్టండి గానీ, వారికి బోట్లు ఇవ్వొద్దంటూ స్వామి వ్యాఖ్యానించారు. 
 
దీనిపై తమిళ రాజకీయాలు సుబ్రహ్మణ్య స్వామి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే జయలలిత జైలుకి వెళ్ళడానికి కూడా సుబ్రహ్మణ్య స్వామి కూడా కారణం కావడంతో అన్నా డీఎంకే వర్గాలు కూడా ఆయన మీద ఆగ్రహంగా వున్నాయి. ఇప్పుడు రాజపక్షే విషయంలో ఆయన తాజాగా చేసిన విజ్ఞప్తి విషయంలో రాజకీయంగా దుమారం రేగే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు.