శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 23 జనవరి 2015 (13:29 IST)

సునంద హత్య కేసు... దుస్తులు తొలగించింది వారేనా... పగిలిన గ్లాసు పట్టిస్తుందా...?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసుకు సంబంధించి క్లూ లాగేందుకు దర్యాప్తు బృందం కృషి చేస్తోంది. ఆరోజు ఆమె బస చేసిన హోటల్ గది నుంచి ఆధారాలు తొలగించినట్లు గుర్తించిన దర్యాప్తు బృందం నలుగురిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సునంద గదిలో కావాలనే ఆల్ప్రాక్స్ మాత్రలను ఉంచినట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
కేసును తప్పుదోవ పట్టించేందుకు వారు అలా చేసి ఉండవచ్చని సందేహిస్తున్నారు. వారు అలా మాత్రలను అలా ఉంచడానికి కారణం ఏమిటంటే, సునంద అధిక మోతాదులో మాత్రలను తీసుకోవడం వల్లనే మృతి చెందిందని చిత్రీకరించేందుకు వారు అలా చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సునంద మృతి తర్వాత గదిలో నుంచి ఆమె దుస్తులు, షూస్ వంటి పలు వస్తువులను ఆ నలుగురిలో ఎవరో మాయం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఆధారాలు పూర్తిగా లభ్యం కాకుండా చూసేందుకే వారు అలాంటి పథకాన్ని పన్ని ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా సునంద మృతి తర్వాత, ముందు నారాయణ సింగ్, థరూర్ పర్సనల్ అసిస్టెంట్ ఆర్కే శర్మ, కుటుంబ మిత్రుడు సంజయ్ దేవాన్, థరూర్ డ్రైవర్ బజరంగీలు గదికి వచ్చినట్లు చెపుతున్నారు. ఈ నలుగురినీ విచారిస్తే వ్యవహారం బయటపడవచ్చని అంటున్నారు. పగిలిన గ్లాసుతో ఆధారాలు ఏమయినా లభ్యం కావచ్చనే విశ్వాసం వ్యక్తమవుతోంది.