మురికిని వదిలించుకోవడం కష్టమే : 'స్వచ్ఛ్ భారత్'లో మోడీ!
పాత అలవాట్లను వదిలించుకోవడం ఒకింత కష్టంతో కూడుకున్న పని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అయితే, మన పరిసరాల్లో ఉన్న మురికిని వదిలించుకునేందుకు మనకు 2019 వరకు సమయం ఉందని, ఈ లోగా స్వచ్ఛ్ భారత్ను చేయిచేయి కలిపితే అసాధ్యం కాకపోవచ్చని ఆయన చెప్పుకొచ్చారు.
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఆయన సమాధికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఉన్న పరిస్థితులను మహాత్మా గాంధీ కళ్లద్దాల ద్వారా చూస్తున్నారన్నారు. మహాత్మా గాంధీ 'పరిశుభ్ర భారత్' నినాదానికి పిలుపు ఇచ్చారన్నారు. అయితే ఆ నినాదం ఇప్పటికీ అసంపూర్తిగా ఉండిపోయిందన్నారు. బాపూజీ ఆశయ సాధన కోసం మనమంతా చేయాల్సింది ఒక అడుగు ముందుకు వేయటమేనని మోడీ పిలుపునిచ్చారు.
భారతీయులంతా కలిసికట్టుగా పనిచేసి ఒక ప్రేరణాత్మక వాతావరణాన్ని సృష్టించాలన్నారు. మనమంతా దేశభక్తితో ఇది చేయాలే కానీ... రాజకీయ ఉద్దేశంతో కాదని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ల ప్రోత్సాహంతో వందశాతం పరిశుభ్రతంగా మారిన గ్రామాలను అనేకం తాను చూశానన్నారు. పరిశుభ్రత కేవలం సఫాయి కార్మికులదేనా అని మోడీ ప్రశ్నించారు. 125 కోట్ల భారతీయులు ఇక భారతమాతను మురికిగా ఉండాలని అనుకోరని ఆయన అన్నారు.
అయితే, పాత అలవాట్లను మానుకోవటం కొంచెం కష్టమే అయినప్పటికీ.. అందుకు మనకు ఇంకా 2019 వరకూ సమయం ఉందని మోడీ అన్నారు. చెత్త ఉన్న ప్రాంతం ఫోటో తీయండి, ఆ తర్వాత వాటిని శుభ్రం చేశాక ఫోటో తీసి నెట్లో పెట్టాలని మోడీ అన్నారు. మార్స్ మిషన్ పూర్తి చేసింది ప్రధాని, మంత్రులు కాదని, భరతమాత బిడ్డలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రపంచంలోని అగ్ర దేశాలు సైతం ఊహించలేని విధంగా అతి తక్కువ ఖర్చుతో అంగారకుడిపై మార్స్ను ప్రయోగించిన మనం దేశాన్ని శుభ్రం చేసుకోలేమా అని ప్రశ్నించారు. బహిరంగ ప్రదేశాలలో పరిశుభ్రత కార్యక్రమంలో తాను తొమ్మిదిమంది పాల్గొనాలని పిలుపునిచ్చానని... వారు మరో తొమ్మిది మందికి ఆహ్వానం పంపాలని మోడీ పిలుపునిచ్చారు.