శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2016 (20:59 IST)

జయలలిత మాట్లాడుతున్నారు... కూర్చుంటున్నారు.... అపోలో ఆస్పత్రి హెల్త్ బులిటెన్ రిలీజ్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై చెన్నై అపోలో ఆస్పత్రి శుక్రవారం ఓ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆమె మాట్లాడుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై చెన్నై అపోలో ఆస్పత్రి శుక్రవారం ఓ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆమె మాట్లాడుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. అయితే, కృత్రిమ శ్వాసతో పాటు, ఫిజియో థెరపీని కొనసాగిస్తున్నామనీ, అందువల్ల ఆమె మరికొన్ని రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స పొందుతారని తెలిపారు. క్రిటికల్ కేర్ వైద్యులు, సీనియర్ కార్డియాలజిస్ట్‌లు జయ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
 
కాగా, గత నెల 22వ తేదీన అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆమెకు... లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బాలే నేతృత్వంలో వైద్యబృందం చికిత్స చేస్తూ కంటికి రెప్పలా కాపాడుతోంది. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి కూడా ముగ్గురు వైద్యులతో కూడిన ఒక బృందం వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. 
 
అదేసమయంలో అమ్మ కూర్చున్నారని, మరికొన్ని రోజుల్లో డిశ్చార్జి చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. దాంతో కొన్నాళ్ల తర్వాత అయినా.. జయలలిత మళ్లీ అధికార పగ్గాలను చేపడతారని పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరపడుతున్నారు. జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమె క్షేమం కోరుతూ తమిళనాడు వ్యాప్తంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వేలాదిమంది అభిమానులు ఆస్పత్రి బయటే అమ్మ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎట్టకేలకు తమ పూజలు ఫలించాయని వాళ్లంతా సంబరపడుతున్నారు.