శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

అమిత్ షా కుమారుడి కంపెనీ వృద్ధిరేటు 16 వేల రెట్లు

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పుత్రుడు జయ్ అమిత్ షా సారథ్యంలోని కంపెనీ టర్నోవర్ ఏకంగా 16 వేల రెట్లు పెరిగిందట. ఈ మేరకు ఓ వెబ్‌సైట్ ఓ కథనం ప్రచురించ

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పుత్రుడు జయ్ అమిత్ షా సారథ్యంలోని కంపెనీ టర్నోవర్ ఏకంగా 16 వేల రెట్లు పెరిగిందట. ఈ మేరకు ఓ వెబ్‌సైట్ ఓ కథనం ప్రచురించింది. దీంతో ఆ వెబ్‌పోర్టల్‍‌పై జయ్ పరువు నష్టం దావా వేశారు. 
 
దీనిపై అహ్మదాబాద్‌లోని అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ జడ్జి ఎస్‌కే గాఢ్వీ కోర్టు విచారణకు ఆదేశించారు. జయ్‌ షా తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) తుషార్‌ మెహతా వాదనలు వినిపించనున్నారు. ఇందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అనుమతించారు. తగిన అనుమతులు తీసుకుని... ఏఎస్‌జీ ప్రైవేటు వ్యక్తుల తరపున వకాల్తా పుచ్చుకోవచ్చునని పీయూష్‌ గోయల్‌ తెలిపారు.
 
మరోవైపు.. ఈ కథనాన్ని ఆసరాగా చేసుకుని విపక్ష పార్టీలు మోడీ సర్కారుపై దుమ్మెత్తి పోస్తున్నాయి. "జయ్‌షాకు చెందిన టెంపుల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ కంపెనీకి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే లాభాలు ఎలా వచ్చాయో చెప్పాలి! కంపెనీ టర్నోవర్‌ రూ.50 వేల నుంచి యేడాదిలో రూ.80 కోట్లకు ఎలా పెరిగిందో బదులివ్వాలి" అని డిమాండ్‌ చేశాయి. 
 
"మోడీజీ... మీరేం చేస్తున్నారు? వాచ్‌మన్‌లా ఉన్నారా!? లేక... మీకూ ఇందులో వాటా ఉందా! ఏదో ఒకటి చెప్పండి!' అని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్విట్టర్‌లో నిలదీశారు. 'పెద్దనోట్ల రద్దువల్ల లబ్ధి జరిగింది ఒక్కరికే! ఆ ఒక్కరు... ఆర్బీఐ, రైతులు, ప్రజలు కాదు! 'షా-షా' మాత్రమే. జై అమిత్‌" అని వ్యాఖ్యానించారు. 
 
'2013, 2014లో జయ్‌ షా కంపెనీ రూ.6230, రూ.1724 నష్టాన్ని నమోదు చేసింది. 2014-15 నుంచి లాభాలు రావడం మొదలైంది. రూ.50 వేలు ఉన్న టర్నోవర్‌ 2015-16లో రూ.80 కోట్లకు చేరింది. బీజేపీ అధికారంలోకి రాగానే మార్పు మొదలైంది. రాజకీయ ఆశ్రిత పక్షపాతానికి ఇది నిదర్శనం కాదా! దీనిపై విచారణ జరపాల్సిందే' అని కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ ఇప్పటికే డిమాండ్‌ చేశారు.