శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (16:54 IST)

మహారాష్ట్రలో అభినవ దుశ్శాసనులకు అరదండాలు!

ఓ వివాహితను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించిన అభినవ దుశ్శాసనులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి వారితో అరదండాలు వేయించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... మహారాష్ట్ర భివాండి జిల్లాకు గుల్బర్గా ప్రాంతం నుంచి కూలి పనుల నిమిత్తం కొన్ని కుటుంబాలు వలస రావడం తరచూ జరుగుతుంటుంది. వీరంతా భవన నిర్మాణ కూలీలుగా పనులు చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. 
 
నర్బోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాజీ నగర్ ప్రాంతంలో నివాసముండే గణ్ పత్ రాథోడ్, శంకర్ జాదవ్ అనే యువకులు, కూలి పనులు చేసుకుని ఇంటికి వెళుతున్న పాతికేళ్ల వివాహితను అటకాయించారు. తమతో వస్తే 2000 రూపాయలు ఇస్తామని ఆశ చూపారు. ఆమె నిరాకరించడంతో ఆమె చీర లాగేందుకు ప్రయత్నించారు. 
 
ఇంతలో వారిని అడ్డుకునేందుకు ఆమె వదిన రావడంతో ఆమెపైనా దాడి చేశారు. ఎలాగో, వారి బారి నుంచి తప్పించుకున్న వదిన, మరదలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆ యువకులపై సెక్షన్ 354, 354(ఎ), 354(బి) కింద కేసులు నమోదు చేశారు. వీరిద్దరిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నర్పోలి స్టేషన్ ఎస్ఐ యోగితా కోకటే తెలిపారు.