శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 సెప్టెంబరు 2018 (16:03 IST)

ట్రిపుల్ తలాక్‌పై కేంద్రం ఆర్డినెన్స్...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో మంది ముస్లిం మహిళల జీవితాలను నాశనం చేస్తున్న ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం (ఆర్డినెన్స్)ను తీసుకొచ్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో మంది ముస్లిం మహిళల జీవితాలను నాశనం చేస్తున్న ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం (ఆర్డినెన్స్)ను తీసుకొచ్చింది. ట్రిపుల్ తలాక్‌లో భాగంగా, ఈ విధానంలో భార్యకు విడాకులు ఇవ్వడాన్ని శిక్షించదగ్గ నేరంగా మారుస్తూ, ఆర్డినెన్స్ తెచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు బుధవారం సమావేశమైన క్యాబినెట్ ఆర్డినెన్స్‌కు ఆమోదం పలుకుతూ, కార్యనిర్వాహక ఉత్తర్వులను వెలువరించింది.
 
ట్రిపుల్ తలాక్ బిల్లు అటు లోక్‌సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ ఆమోదం పొందడంలో విఫలమైన నేపథ్యంలోనే, ఆర్డినెన్స్ తేవాలని ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ బిల్లును మరోసారి పరిశీలించేందుకు సెలక్ట్ కమిటీకి పంపాలని పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేయడంతో బిల్లు చర్చల దశలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. ముస్లిం మహిళల కోసం కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు గత పార్లమెంట్ సమావేశాల్లో కార్యరూపం దాల్చలేదు. దీంతో కేంద్రం ఆర్డినెన్స్ రూట్ తొక్కింది.
 
తలాక్‌ను నేరంగా పరిగణించే ముస్లిం మహిళల బిల్లు-2017 గత డిసెంబర్ 28న లోక్‌సభలో ఆమోదం పొందింది. అయితే రాజ్యసభలో ఆమోదం పొందలేకపోయింది. బిల్లులో సవరణలు చేయాలని కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. దీంతో ఇటీవల ఆ బిల్లులో కేంద్రం మూడు కీలక సవరణలు చేసింది. అయినప్పటికీ వర్షాకాల సమావేశాల్లో బిల్లుపై చర్చ జరక్కపోవడంతో ముస్లిం మహిళలకు ఊరట కల్గించేందుకు కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డినెస్ బాట పట్టింది. ఈ ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.