గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 29 నవంబరు 2017 (20:30 IST)

ఆర్కే నగర్ బైపోల్ : 184వ సారి బరిలో 'ఎలక్షన్‌ కింగ్'

సాధారణంగా ఎన్నికల్లో ఒకటి రెండు సార్లు మహా అయితే ఐదారు సార్లు పోటీ చేసి విరమించుకుంటారు. కానీ, ఈ ఎలక్షన్ కింగ్ మాత్రం ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఇప్పటివరకు ఏకంగా 183 సార్లు పోటీ చేసి మరోమారు బరిలో

సాధారణంగా ఎన్నికల్లో ఒకటి రెండు సార్లు మహా అయితే ఐదారు సార్లు పోటీ చేసి విరమించుకుంటారు. కానీ, ఈ ఎలక్షన్ కింగ్ మాత్రం ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఇప్పటివరకు ఏకంగా 183 సార్లు పోటీ చేసి మరోమారు బరిలో నిలిచాడు. ఆయన పేరు డాక్టర్ కె.పద్మరాజన్. పోటీ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా బరిలోకి దిగడం మాత్రం మానరు. గెలుపు గురించి పట్టించుకోకుండా స్థానిక సంస్థల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తూనే ఉంటారు. అందుకే ఎలక్షన్‌ కింగ్‌ అయ్యారు. 
 
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆర్‌కే నగర్‌ నియోజకవర్గానికి డిసెంబర్ 21వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పద్మరాజన్ పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్‌ వేశారు. తమిళనాడు సేలంకు చెందిన పద్మరాజన్‌ వృత్తిపరంగా డాక్టర్‌. 1988లో తొలిసారిగా ఆయన ఎన్నికల్లో పోటీచేశారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పోటీచేస్తూనే ఉన్నారు. 
 
రాష్ట్రపతి ఎన్నికల్లోనూ పోటీ చేశారు. మాజీ రాష్ట్రపతులు కేఆర్‌ నారాయణ, అబ్దుల్‌ కలాం, ప్రతిభాపాటిల్‌కు పోటీగా ఆయన నామినేషన్‌ వేశారు. అంతేగాక.. ప్రముఖ రాజకీయ నాయకులు మన్మోహన్‌ సింగ్‌, వాజ్‌పేయి, జయలలిత, కరుణానిధి, పీవీ నరసింహరావు వంటి ప్రముఖులపైనా పోటీ చేశారు. 1991లో ప్రధాని పీవీ నరసింహరావుకు ప్రత్యర్థిగా పద్మరాజన్‌ నామినేషన్‌ వేసినప్పుడు ఆయనపై దాడి కూడా జరిగింది. అయినా సరే ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం మానట్లేదు. అయితే ఎందులోనూ ఆయన విజయం సాధించలేకపోయారు. 
 
నామినేషన్‌ వేశాక ఆయన ఎలాంటి ప్రచారం చేయరు. నామినేషన్ డిపాజిట్ చెల్లించడం మినహా ఒక్కపైసా కూడా ఖర్చు చేయరు. ప్రజాస్వామ్యాన్ని నిరూపించడమే తన లక్ష్యమని చెబుతారు. అంతేకాదండోయ్‌.. ఎక్కువసార్లు ఎన్నికల్లో పోటీచేసినందుకు గానూ ఆయన గిన్నిస్‌ బుక్‌, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ చోటుసాధించారు.