శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (14:12 IST)

ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యే దంపతుల దౌర్జన్యం.. విద్యార్థి చెంప చెళ్లుమనిపించారు...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అరాచకాల అడ్డాగా మారిపోతోంది. కేవలం సంఘ విద్రోహశక్తులు మాత్రమే కాకుండా, ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన శాసనసభ్యులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. తాజాగా తమ సుపుత్రుడుని సహ విద్యార్థి కొట్టాడన్న కోపంతో అధికార సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే షాజిల్ ఇస్లామ్ దంపతులు పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపాల్ చూస్తుండగానే చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు లేదా కనీసం స్పందించేందుకు సైతం పాఠశాల యాజమాన్యం ముందుకు రాకపోవడం ఆ ఎమ్మెల్యే దౌర్జన్యకాండకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరోవైపు.. ఎమ్మెల్యే చేతిలో చెంపదెబ్బ తిన్న బాలుడి తల్లి సుల్తానా మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకుంది.
 
గురువారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే.. మహ్మద్ అలీ, ఎమ్మెల్యే కుమారుడు షర్ఫ్ ఒకే తరగతి చదువుతున్నారు. వీరిద్దరు మంచి స్నేహితులు కూడా. కొన్ని రోజుల కిందట ఎమ్మెల్యే కుమారుడు తన కొడుకును థర్మాస్ ఫ్లాస్క్‌తో కొట్టాడని... ప్రతిగా తన కుమారుడు స్కేలుతో కొట్టాడని తెలిపింది. ఆ విషయం అంతటితో సద్దుమణిగిందని పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే స్కూలుకు వెళ్ళి తన కొడుకుపై చేయి చేసుకున్నాడని సుల్తానా చెప్పింది. ఎమ్మెల్యే భార్యకు తాను క్షమాపణలు చెప్పినా, ఇలా చేశారని వాపోయింది. తాజా ఘటనపై స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేశానని, వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూసి, తదుపరి చర్యకు ఉపక్రమిస్తానని ఆమె తెలిపింది.
 
మరోవైపు.. ఎమ్మెల్యే భార్య ఆయేషా సలీమ్ భిన్న కథనం వినిపిస్తోంది. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు పన్నిన కుట్ర అని ఆరోపించింది. అలీ మా అబ్బాయిని రోజూ వేధిస్తాడు. ఆ విషయమే స్కూలు యాజమాన్యానికి చెప్పాలని వెళ్ళాం' అంటూ వివరించింది.