అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాల్సిదే : వీహెచ్పీ డిమాండ్
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మెజార్టీతో అధికారంలో ఉన్నందున అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని చేపట్టాల్సిందేనంటూ విశ్వహిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై ఆ సంస్థ అగ్రనేత అశోక్ సింఘాల్ అలహాబాద్లో మాట్లాడుతూ... సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీజేపీ రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు.
1999-2004 సంవత్సరాల మధ్య సంకీర్ణం ఒత్తిళ్ల పేరిట అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి రామమందిర నిర్మాణం విషయలో తన అశక్తతను వ్యక్తం చేశారని ఆయన గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీకి ఎలాంటి అవరోధాలూ లేవని.. ఆయన నాయకత్వంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిందని, అందువల్ల తక్షణం రామమందిర నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు.
పార్లమెంట్లో చట్టం ద్వారా నవ్య రామమందిర నిర్మాణానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయ వివాదాల్లో ఏళ్ల తరబడి జాప్యం జరిగిన ఈ సమస్యను పరిష్కరించేందుకు మోడీ సర్కార్ తన అధికారాలను ఉపయోగించాలని ఆయన కోరారు. రామాలయ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోందంటూ ఆర్ఎస్ఎస్ ప్రకటించిన రెండు రోజులకే వీహెచ్పీ అగ్రనేత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.