శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (11:03 IST)

శశికళ జైలుకు.. పదేళ్ల పాటు పోటీకి అనర్హురాలు.. ఆ ముగ్గురు కోర్టులో లొంగిపోండి!

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. సుప్రీం కోర్టులో జయలలిత అక్రమాస్తుల కేసుపై తీర్పు వెలువడింది. నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో శశికళ రెండో నిందితురా

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. సుప్రీం కోర్టులో జయలలిత అక్రమాస్తుల కేసుపై తీర్పు వెలువడింది. నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో శశికళ రెండో నిందితురాలు. చిన్నమ్మ దోషిగా తేలడంతో చిన్నమ్మ జైలు తప్పలేదు. ఫలితంగా సుప్రీం తీర్పు ప్రతికూలంగా రావడంతో.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరనేదానిపై అన్నాడీఎంకేలో తీవ్ర చర్చ జరుగుతోంది. 
 
సోమవారం గోల్డెన్ బే రిసార్ట్స్‌కు వెళ్లిన శశి ఇదే అంశంపై అనుచర ఎమ్మెల్యేలతో చర్చించారు. తీర్పు ప్రతికూలంగా వస్తే సీఎం పదవికి శశి అనర్హురాలు. అందుకోసమే తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని చేయాలనే అంశంపై ముఖ్య ఎమ్మెల్యేలతో ఆమె చర్చించారు. 
 
అంతర్గతంగా ముగ్గురు పేర్లను ఎమ్మెల్యేలు సూచించినట్లు సమాచారం. కాగా తీర్పు ప్రతికూలంగా వస్తే తన మేనల్లుడు దీపక్‌ను రంగంలోకి దించాలని యోచిస్తున్నట్లు తెలియవచ్చింది. దీపక్‌కు సీఎం పదవి కట్టబెట్టి మంత్రాంగం నడిపించాలని శశి భావిస్తున్నట్లుగా సమాచారం.
 
ఇదిలా ఉంటే, శశికళ అనుచరులు కోర్టు తీర్పును తప్పుబడుతున్నారు. కేంద్రం ఆడిన నాటకంలో శశికళను బలిపశువును చేశారని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు శశికళ వర్గం సిద్ధమైంది. అయితే ఈ పరిస్థితిని ముందే ఊహించిన హోం శాఖ పోలీసు శాఖను సమాయత్తపరిచింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. అయితే కోర్టు తీర్పుపై పన్నీర్ వర్గం హర్షం వ్యక్తం చేసింది. 
 
ధర్మ యుద్ధంలో అన్యాయం ఎన్నటికీ పైచేయి సాధించడనడానికి సుప్రీం కోర్టు తీర్పే నిదర్శనమని పన్నీరు పంచన చేరిన నేతలు చెప్పుకొస్తున్నారు. గవర్నర్‌ కోర్టు తీర్పు ఆమెకు ప్రతికూలంగా ఉంటుందనే ముందే ఊహించి, ఎమ్మెల్యేల మద్దతున్న ఆమెను సీఎం కాకుండా అడ్డుకున్నారని శశికళ అనుచరులు ఆరోపిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో గోల్డెన్ బే రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. 
 
కోర్టు ఆదేశాల మేరకు శశికళకు చెందిన అనేక అక్రమాస్తులను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమైంది. జయ టీవీకి ప్రస్తుతం శశికళ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శశికళ, ఇళవరసి, సుధాకరన్ వెంటనే కోర్టులో లొంగిపోవాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి శశికళ అనర్హురాలని కోర్టు పేర్కొంది.