శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2015 (12:53 IST)

ఆకలిగా ఉన్నామంటూ ట్వీట్ చేసిన విద్యార్థులు.. ఆకలి తీర్చిన సురేష్ ప్రభు.. ఎలా.?

ఆకలిగా ఉన్నామంటూ విద్యార్థులు చేసిన గంటల్లోనే రైల్వే మంత్రి సురేష్ ప్రభు యాక్టివ్ అయ్యారు. అంతేగాకుండా పిల్లల ఆకలిని తీర్చే చర్యలు చేపట్టారు. దీంతో ప్రశంసలు అందుకున్నారు. ఈ ఘటన డెహ్రాడూన్‌లో చోటుచేసుకుంది. డెహ్రాడూన్‌లోని ఏసీఎన్ స్కూలులో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు శీతాకాల సెలవులు ఇచ్చేసరకి తమతమ ఇళ్లకు వెళ్లేందుకు హరిద్వార్ నుంచి హౌరా వెళ్లే కుంభ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. 
 
పొగ మంచు కారణంగా రైలు చాలా ఆలస్యంగా నడుస్తోంది. ఆ రైల్లో ప్యాంట్రీ కార్ లేదు. వారణాసి సమీపంలోకి వచ్చేసరికి పిల్లలంతా ఆకలితో ఉన్నారు. ఇంకా ఎంతసేపటికి గమ్యం చేరుతామో తెలియని పరిస్థితిలో, ట్విట్టర్ ద్వారా తమ ఆకలి గురించి ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ట్వీట్‌ను చూసిన మంత్రి సురేష్ ప్రభు.. వెంటనే అధికారులకు వారి ఆకలి తీర్చాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పిల్లలు ట్వీట్ చేసిన నిమిషాల్లో, వారికి ఆహారం, మంచినీరు, కాఫీ వంటివి వారి సీట్ల వద్దకే వచ్చేశాయి. దీంతో విద్యార్థులతో పాటు వారితో ప్రయాణించిన ఉపాధ్యాయులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 
 
అంతేగాకుండా.. "ఇండియా మారుతోంది అనడానికి ఇదే నిదర్శనం. ప్రతి ఫిర్యాదుపై అధికారులు, మంత్రులు ఇలాగే స్పందిస్తే ప్రజలంతా ఎంతో ఆనందిస్తారు" అని విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఉపాధ్యాయుడు అమిత్ కుమార్ వ్యాఖ్యానించారు. రాత్రి పది గంటల సమయంలో సాయం చేయాల్సిందిగా సమాచారం అందిందని.. వెంటనే తాను కావాల్సినన్నీ తీసుకుని రైలుకు చేరుకున్నట్లు స్థానిక చీఫ్ ఏరియా మేనేజర్ రవి ప్రకాష్ చతుర్వేది వెల్లడించారు.