నోట్లో పురుగుల మందు పోసిన భర్త.. భార్య మృతి
కట్టుకున్న మొగుడే కాల యముడై తన భార్య నోట్లో పురుగుల మందు పోశాడు..! ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం, పడమట నర్సాపురం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆ గ్రామానికి చెందిన బూరుగు నర్సమ్మ(32), ముక్తేశ్వరరావు భార్యాభర్తలు.
ముక్తేశ్వర రావు బుధవారం రాత్రి మద్యం తాగి భార్యను కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె నోట్లో పురుగుమందు పోశాడు. కొన ఊపిరితో ఉన్న నర్సమ్మను స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఆమె మరణించింది. దీంతో ఆగ్రహించిన నర్సమ్మ తరపు బంధువులు ముక్తేశ్వరరావుకు దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.