శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 మార్చి 2017 (16:27 IST)

150 గంటలు... 50 నిర్ణయాలు.. ఒక్క కేబినెట్ భేటీ లేకుండానే ఆదేశాలు.. దటీజ్ సీఎం యోగి

దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్.. కేవలం వారంరోజులు తిరిగేలోపు ప్రభుత్వంపై తనదైనముద్ర వేసేలా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు.

దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్.. కేవలం వారంరోజులు తిరిగేలోపు ప్రభుత్వంపై తనదైనముద్ర వేసేలా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఒక్కటంటే ఒక్క మంత్రివర్గ సమావేశం కూడా నిర్వహించలేదు. పైపెచ్చు.. 150 గంటల్లో 50 కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగిపోతున్నారు. ఈ 50 నిర్ణయాలు ప్రజలకు ఎంతో మేలు చేసేవిగానూ, అవినీతి అధికారులు, కాంట్రాక్టర్లు, రోడ్‌సైడ్ రోమియోల భరతం పట్టేవిగా ఉన్నాయి. 
 
సీఎంగా యోగి తీసుకున్న నిర్ణయాల్లో ప్రత్యేకించి గోవధ నిషేధం, యాంటీ రోమియో బృందాల ఏర్పాటు. ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్ మసాలా, పాలిథీన్ నిషేధం. ఈ మూడు నిర్ణయాలపై ప్రజల నుంచి విశేష స్పందన రావడం గమనార్హం. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్ మసాలా, పాలిథీన్ నిషేధంపైనా ప్రశంసలు వెల్లువెత్తాయి. 
 
అలాగే, మానససరోవర యాత్రికులకు రూ.50 వేల నుంచి రూ.లక్ష మేర ఆర్థిక సాయం పెంచారు. జూన్ 15 నాటికల్లా రోడ్లపై గుంతలు కనబడకూడదని ప్రజాపనుల శాఖ అధికారులను ఆదేశించడం. ముఖ్యంగా నేర చరిత్ర ఉన్న కాంట్రాక్టర్లను తొలగించి నిజాయితీగా పనిచేసే వారికి పనులు అప్పగించాలని ఆయన ఆదేశించారు. 
 
ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు. ఉపాధ్యాయులు టీ షర్టులు వేసుకుని స్కూళ్లకు వెళ్లరాదనీ... అవసరానికి మించి మొబైల్ ఫోన్లు ఉపయోగించరాదని ఆదేశించారు. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులకు ఇస్తున్న భద్రతను పునస్సమీక్షించడం.... మంత్రులంతా 15 రోజుల్లోగా ఆస్తులు వివరాలు సమర్పించాలని ఆర్డరిచ్చారు. 
 
అధికారులు, మంత్రులు ప్రభుత్వ ఫైళ్లను ఇంటికి తీసుకెళ్లరాదనీ... ఆఫీసు పనివేళల్లోనే వాటిని క్లియర్ చేయాలని కూడా యోగి సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్‌ రిసెప్షన్‌లో ఇద్దరు పోలీసులు ఉండాలని వారిలో కచ్చితంగా ఒక మహిళా పోలీసు ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో పోలీసు స్టేషన్‌లలో మంచి సదుపాయాలతో పాటు, మరింత మంది మహిళా పోలీసులను నియమించాలని ఆదేశించారు.
 
ముఖ్యంగా.. మంత్రులందరి కార్లకు ఉండే ఎర్రబుగ్గలను తొలగించాలని, అధికారులు, మంత్రులు 10 గంటలకల్లా తమ కార్యాలయాల్లో ఉండాలని ఆదేశించడంతో పాటు... బయోమెట్రిక్ హాజరు పద్ధతిని కూడా ప్రవేశపెట్టాలని ఆయన ఆదేశించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇలా ఒక్క కేబినెట్ సమవేశం కూడా జరక్కుండానే శరవేగంగా 50కి పైగా నిర్ణయాలు తీసుకోవడం... ముందు ముందు యోగి పాలన ఎలా ఉండబోతోందో సూచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.