రొయ్యలతో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలి?
సీ ఫుడ్లో బెస్ట్ హెల్దీ ఫుడ్ రొయ్యలే. రొయ్యలు మన శరీర ఆరోగ్యానికి అవసరం అయ్యే ప్రోటీన్స్, లోఫ్యాట్, లోక్యాలరీలను అందిస్తాయి. రొయ్యల్ని తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించవచ్చు. తద్వారా గుండె సంబంధిత వ్యాధులను నివారించుకోవచ్చు. అలాగే రొయ్యల్లోని క్యాల్షియం దంత, ఎముకల సమస్యలను దూరం చేస్తుంది. అలాంటి హెల్దీ రొయ్యలతో సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం..
కావలసిన పదార్థాలు :
బాస్మతి రైస్ : మూడు కప్పులు
రొయ్యలు : అర కేజీ
క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ : ముక్కలు ఒక కప్పు
బ్లాక్ పెప్పర్ పొడి : రెండు స్పూన్లు
నూనె, ఉప్పు : తగినంత
తయారీ విధానం :
ముందుగా రొయ్యల్నిశుభ్రం చేసి, నిమ్మరసం, ఉప్పు మిక్స్ చేసి ఉడికించుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోయాలి. వేడయ్యాక ఉడికించిన రొయ్యల్ని దోరగా వేయించుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అదే పాన్లో మరికొద్దిగా నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మరో నిముషం వేయించుకోవాలి. ఇందులోనే క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ముక్కల్ని వేయించాలి.
ఇవి వేగాక కొద్దిగా ఉప్పు చిలకరించి పెప్పర్ పౌడర్ కూడా చిలకరించి ఐదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకొన్న రొయ్యలను కూడా వేసి వేయించుకోవాలి. ఇందులో ముందుగా వండి పెట్టుకున్న అన్నం కూడా చేర్చి బాగా మిక్స్ అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు స్టౌ మీదే ఉంచి ఫ్రై చేసుకుని.. సర్వింగ్ బౌల్లో తీసుకుని సాస్ లేదా కడాయ్ చికెన్, పనీర్ మసాలాతో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.