శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By pnr

శ్రీవారి భక్తుల వద్ద నిర్బంధ వసూళ్లు... క్షురకుల తొలగింపు

శ్రీవారి భక్తుల వద్ద తిరుమల ఆలయంలోని కల్యాణకట్టలో పనిచేసే క్షురకులు నిర్బంధంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో 240 మంది క్షురకులను తితిదే అధికారులు తొలగించారు. ఇపుడు ఈ నిర్ణయం వి

శ్రీవారి భక్తుల వద్ద తిరుమల ఆలయంలోని కల్యాణకట్టలో పనిచేసే క్షురకులు నిర్బంధంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో 240 మంది క్షురకులను తితిదే అధికారులు తొలగించారు. ఇపుడు ఈ నిర్ణయం వివాదాస్పదంతో పాటు.. చర్చనీయాంశంగా మారింది.
 
శ్రీవారి కల్యాణకట్టలో పనిచేస్తున్న 1400 క్షురకుల్లో శాశ్వత ఉద్యోగులు, తాత్కాలిక కార్మికులు ఉన్నారు. పర్మినెంట్‌ క్షురకులకు టీటీడీ జీతభత్యాలు చెల్లిస్తోంది. తాత్కాలిక కార్మికులకు.. ఒక్కో గుండుకు 7 రూపాయల వంతున చెల్లిస్తున్నారు. అయినా.. క్షురకులు భక్తుల నుంచి అదనపు రుసుం వసూలు చేస్తున్నారని, కొన్ని సార్లు విపరీతంగా వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 
 
డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో చాలామంది భక్తులు టీటీడీ కార్యనిర్వహణాధికారికి ఈ అంశంపై ఫిర్యాదులు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ కల్యాణకట్టలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించి, భక్తుల నుంచి డబ్బులు తీసున్న 240 మంది క్షురకులను విధుల నుంచి తొలగించారు. 
 
ఈ చర్యను క్షురకులు తప్పుపడుతున్నారు. తమపై ఎలాంటి ఆరోపణలు లేకపోయినా... సీసీటీవీ దృశ్యాల ఆధారంగా విధుల నుంచి తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తలనీలాలు తీసినప్పుడు భక్తులు సంతోషంగా ఇచ్చే పది, ఇరవై రూపాయలను తీసుకుంటున్నామని, దీనిలో నిర్బంధం లేకపోయినా టీటీడీ చర్యలు తీసుకోవడం సరికాదన్నది మరికొందరి వాదన. విధుల నుంచి తొలిగించిన క్షురకులను తిరిగి తీసుకోపోతే న్యాయపోరాటం తప్పదని నాయీ బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. 
 
మరోవైపు మచ్చపడ్డ క్షురకులపై చర్యను టీటీడీ అధికారులు సమర్థించుకుంటున్నారు. ఫిర్యాదులున్న క్షురకులకు తిరుమల జేఈవో, ముఖ్య నిఘా, భద్రతాధికారి ద్వారా కౌన్సెలింగ్‌ ఇప్పించినా.. మార్పు రాకపోడంతో చర్యలు తప్పలేదని అధికారులు చెబుతున్నారు.