వరుస లాభాలకు బ్రేక్ పడింది.. నష్టాలతో ముగిసిన సెన్సెక్స్
గత కొన్ని సెషన్లుగా లాభాల్లో పయనిస్తూ వచ్చిన భారత స్టాక్ మార్కెట్ పరుగుకు ఎట్టకేలకు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో బ్రేక్ పడింది. సెషన్ ఆరంభం నుంచే ఒత్తిడిలో కొనసాగిన సూచికలు, పలుమార్లు లాభాల దిశగా సాగినప్పటికీ, ఒత్తిడిని తట్టుకోలేక చతికిలబడ్డాయి. ఇదే సమయంలో స్మాల్, మిడ్క్యాప్ కంపెనీలు మాత్రం నామమాత్రపు లాభాలను నమోదు చేశాయి.
ఫలితంగా శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 42.24 పాయింట్లు పడిపోయి 0.16 శాతం నష్టంతో 25,838.14 పాయింట్ల వద్దకు, నిఫ్టీ సూచిక నిఫ్టీ 12.75 పాయింట్లు పడిపోయి 0.16 శాతం నష్టంతో 7,899.30 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.08 శాతం, స్మాల్ క్యాప్ 0.02 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 25 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి.
మరోవైపు మారుతీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంకుల షేర్లు సైతం లాభపడ్డాయి. అలాగే హిందుస్థాన్ యునీలివర్ సంస్థ షేర్లు అత్యధికంగా 2.27 శాతం నష్టపోయి రూ.883.50 వద్ద ముగిశాయి. ఏషియన్ పెయింట్, హెచ్డీఎఫ్సీ, సన్ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్ సంస్థల షేర్లు సైతం నష్టపోయాయి.
ఇకపోతే వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర శుక్రవారం స్వల్పంగా తగ్గింది. రూ.100 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,800కి చేరింది. కీలక సమయాల్లో నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.17 శాతం తగ్గి 1,245.90 అమెరికన్ డాలర్లకు చేరింది. శుక్రవారం బంగారంతోపాటు వెండి ధర సైతం తగ్గింది. రూ.550 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.40,350కి చేరింది. పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో దీని ధర తగ్గిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.