1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : ఆదివారం, 9 డిశెంబరు 2018 (09:34 IST)

ఈ సర్వేతో లగడపాటికి సన్యాసమే : కేటీఆర్ జోస్యం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లోక్‌సభ మాజీ సభ్యుడు, ఆంధ్రా ఆక్టోపస్‌గా గుర్తింపు పొందిన లగడపాటి రాజగోపాల్‌పై తెలంగాణ రాష్ట్ర తాజా మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజా కూటమికి అనుకూలంగా ఉంటాయని లగడపాటి చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. 
 
ఎందుకంటే, తెలంగాణ ప్రజలు శాసనసభ ఎన్నికల్లో తెరాసకే ఓటర్లంతా ఏకపక్షంగా ఓటేశారని, వారి ఆదరణ, అండదండలతో వందకుపైగా స్థానాల్లో తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. ఓటర్లు చైతన్యవంతులై పెద్దఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్నారని, గతంలో కంటే పోలింగ్‌ శాతం పెరిగి, 73 శాతానికి చేరడం తెరాసకు పూర్తిగా సానుకూలమని, అభివృద్ధికి ఊతమిచ్చినట్లుగా విశ్వసిస్తున్నామన్నారు. 
 
తెరాసకు వచ్చే ఓట్లు 50 శాతం దాటడం ఖాయమన్నారు. విపక్షాల గారడీలను ప్రజలు పట్టించుకోలేదని, వాటికి తగిన గుణపాఠం చెప్పాయన్నారు. తెలంగాణలో పోలింగ్‌ప్రక్రియ ముగిసిన అనంతరం కొన్ని ఛానళ్లు ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలను ప్రకటించాయని.. దాదాపు అన్ని సర్వేలూ తెరాస విజయాన్ని వెల్లడించాయన్నారు. అవి అంచనా వేసిన దానికంటే ఎక్కువ సీట్లు తమకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కానీ, లగడపాటి సర్వే ఒక్కటే భిన్నంగా ఉందన్నారు. అందువల్ల ఈ సర్వేతో లగడపాటి సన్యాసం తీసుకోవడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు.