శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (12:57 IST)

ఆజాద్ ఆపరేషన్.. టి.కాంగ్రెస్‌లో అలజడి.. హస్తిన ఫ్లైటెక్కిన ఉత్తమ్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అలజడి చెలరేగింది. ఆ పార్టీ సీనియర్ నేత, అధిష్టానం నమ్మినబంటు గులాం నబీ ఆజాద్ ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు. దీంతో టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తిన విమానమెక్కారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. పార్టీలో ఏం జరుగుతోందన్న అలజడి వారిలో చెలరేగింది. 
 
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మంగళవారం ఉదయం వెల్లడికానున్నాయి. ఈ ఫలితాల్లో రాష్ట్రంలో హంగ్ ఏర్పడే పరిస్థితి ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీల నేతలు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా, ప్రజా కూటమి నేతలు మరింత అలెర్ట్‌గా ఉన్నారు. ఇందులోభాగంగా వారంతా గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌ను సోమవారం సాయంత్రం 3 గంటలకు కలువనున్నారు. 
 
ఇదిలావుంటే గులాం నబీ ఆజాద్ పిలుపు మేరకు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినకు చేరుకున్నారు. ఆయన పార్టీ పెద్దలతో కలిసి మంతనాలు సాగించారు. ఉత్తమ్ ఉన్నట్టుండి ఢిల్లీకి ఎందుకు వెళ్లారనేది ఆ పార్టీల్లోనే కాకుండా, ఇతర పార్టీల నేతల్లో సైతం ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ పార్టీ పెద్దలతో ఏం చర్చించారన్నది సస్పెన్స్‌గా మారింది. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడే సూచనలున్నాయని భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. హంగ్ ఏర్పడితే మాత్రం ఎంఐఎం సభ్యులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా, కాంగ్రెస్, తెరాసల నుంచి టిక్కెట్లు ఆశించి భంగపడిన నేతలు గెలిస్తే తమవైపునకు తిప్పుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం అనుసరించాల్సిన వైఖరి... వ్యూహాలు రచించే బాధ్యతలను ఆజాద్‌కు పార్టీ అధినేత రాహుల్ గాంధీ అప్పగించినట్టు సమాచారం.