శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: సోమవారం, 27 జనవరి 2020 (18:21 IST)

తెలంగాణాలో దారుణమైన ఘటన, నిద్రిస్తున్న మహిళను ఎత్తుకెళ్ళి గ్యాంగ్ రేప్

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళను ఎత్తుకెళ్లి ఆమెపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రఘునాథపాలెం మండలానికి చెందిన 35 ఏళ్ల వివాహిత ఇంట్లో నిద్రపోతోంది. నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇద్దరు యువకులు గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించారు. ఆమె కేకలు వేయకుండా నోరు గట్టిగా అదిమిపెట్టి ఆమెను బలవంతంగా తీసుకుని వెళ్లారు. 
 
మధ్యలో వారితో మరికొందరు యువకులు కలిశారు. ఆమెను అదే మండలంలోని హర్యాతండాలోని పత్తి చేనులోకి తీసుకుని వెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. పక్కింటి వ్యక్తి సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే వారు పరారయ్యారు. 
 
తనపై హర్యాతండాకు చెందిన మోహన్, ఉపేందర్, కల్యాణ్, చంటి, అజ్మీరా నాగేశ్వర రావు, సుకినీ తండాకు చెందిన అశోక్, సునీల్ అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం జరిగిన స్థలాన్ని పోలీుసులు పరిశీలించారు. నిందితులు అదే ప్రాంతంలో మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. 
 
నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి గ్రామానికి చెందినవారు, బంధువులు రఘునాథపాలెం పోలీస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.