బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Updated : శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (18:45 IST)

మిర్యాలగూడలో యువకుడి హత్య... పరువు హత్యేనా? మాటువేసి తల్వార్‌తో నరికేశాడు...

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైనాడు. ప్రెగ్నెన్సీతో ఉన్న తన భార్యను హాస్పిటల్‌లో చూపించి తిరిగి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుండి తల్వార్‌తో దాడి చేసి హతమార్చ

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైనాడు. ప్రెగ్నెన్సీతో ఉన్న తన భార్యను హాస్పిటల్‌లో చూపించి తిరిగి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుండి తల్వార్‌తో దాడి చేసి హతమార్చాడు. మృతి చెందిన యువకుడు పట్టణంలోని వినోభానగర్‌కు చెందిన పెరుమళ్ళ ప్రణయ్ కుమార్‌గా గుర్తించారు. 
 
మృతుడు ప్రణయ్ గత ఆరు నెలల క్రితం పట్టణంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏకైక కుమార్తె అమృతను ప్రేమ వివాహం చేసుకొని ఇటీవలే రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా చేసాడు. పెండ్లి సమయంలోనే ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొనగా పొలీస్ ఉన్నతాధికారుల జోక్యంతో అ సమస్య సద్దుమణిగింది. 
 
కాగా ఈ రోజు ప్రెగ్నెన్సీతో ఉన్న భార్య అమృతను స్థానిక జ్యోతి హాస్పటల్‌లో చూపించి తిరిగి ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి తల్వార్‌తో దాడి చెయ్యడంతో ప్రణయ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రేమ వివాహమే యువకుడి హత్యకు కారణమని భావించిన మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా ఉంది. జిల్లా ఎస్పీ రంగనాథ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షిస్తున్నారు.
 
హత్య చేసిన నిందితుడి కోసం 8 బృందాలు వెతుకుతున్నాయి. బీటెక్ చదివిన పెరుమల్ల ప్రణయ్ 
తండ్రి పెరుమళ్ల బాలస్వామి ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తున్నారు. మరోవైపు మిర్యాలగూడలో ప్రణయ్ హత్యపై జిల్లా ఎస్పీ రంగనాధ్ విచారణను వేగవంతం చేశారు. హతుడు ప్రణయ్‌ది పరువు హత్యగానే అనుమానిస్తున్నట్లు చెప్పారు. గతంలో అతడికి ప్రాణ హాని ఉందని అతడి తలిదండ్రులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని తెలిపారు. ఈ క్రమంలో యువతి తండ్రి మారుతిరావును కూడా హెచ్చరించినట్లు పేర్కొన్నారు. 
 
ప్రణయ్‌కు ఎలాంటి హాని చేయమని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు. మొన్నటిదాకా కూతురు, అల్లుడితో సఖ్యతగా ఉంటే వివాదం సద్దుమణిగిందనుకున్నామని చెప్పారు. కాగా ఈ హత్యకు అమ్మాయి తండ్రే సూత్రధారి అని ఇంకా నిర్థారణ కాలేదనీ, ప్రణయ్ హత్యపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టి వాస్తవాలను వెలికి తీస్తామని అన్నారు.