అఫ్ఘన్లో ఉగ్రశిక్షణకు యువకుల ఎంపిక.. హైదరాబాద్ కేంద్రం!
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ఖైదా ఇచ్చే ఉగ్రశిక్షణకు ఆప్ఘనిస్థాన్ కేంద్రంగా మారగా, ఇందుకు అవసరమైన యువకులను హైదరాబాద్ కేంద్రంగా ఎంపిక చేసిం పంపిస్తున్నారు. ఈ విషయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా వెలుగుచూసింది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఉత్తర మండల డీసీపీ జయలక్ష్మీ మీడియాకు వివరించారు. నగరానికి చెందిన మౌతసిమ్ బిల్హా ఇస్లామిక్ రాజ్యం స్థాపించేందుకు జిహాద్ చేయాలంటూ చురుకైన యువకులను అఫ్ఘనిస్థాన్లో ఉగ్రవాద శిక్షణ కోసం పంపిస్తున్నాడు.
ఈ క్రమంలో ఇతడికి మహారాష్ట్ర ఒమర్ఖేడ్ జిల్లా షాకాలనీకి చెందిన షా ముదసిర్ అలియాస్ తల్హా (25), హంగోలి జిల్లా అఖడబాలాపూర్కు చెందిన షోయబ్ అహ్మద్ఖాన్ (24) అనే ఇద్దరు యువకులు పరిచయమయ్యారు. షా స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అనుబంధ షాహిన్ ఫోర్స్లో ఇతడు కీలక సభ్యుడు. 2001లో సిమీపై నిషేధం విధించడంతో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మైనారిటీ స్టూడెంట్ (ఏఐఎంఎస్)లో సభ్యుడిగా చేరాడు.
ఆ తర్వాత సోదరుడి ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తూ వచ్చాడు. ఫేస్బుక్ వేదికగా వీరిద్దరిని అఫ్ఘనిస్థాన్లో ఉగ్రశిక్షణకు వెళ్లేందుకు మౌతసిమ్ బిల్హా ఒప్పించాడు. ఈ మేరకు ఒకసారి హైదరాబాద్కు వచ్చి తనను కలవాలని వారిని సూచించాడు. దీంతో వారిద్దరు గత నెల 3న బిల్హా ఇంటికి వద్దకు వచ్చి కలిసి వెళ్లారు.
ఆ తర్వాత అఫ్ఘనిస్థాన్ వెళ్లేందుకు సిద్ధమైతే అక్టోబర్ 10వ తేదీన మళ్లీ తన వద్దకు రావాలని వారికి సూచించాడు. దీంతో షా ముదసిర్, షోయబ్లు మహారాష్ట్ర నుంచి తిరిగి బుధవారం రైలులో సికింద్రాబాద్ చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న వీరిని గోపాలపురం పోలీసులు అదపులోకి తీసుకొని ప్రశ్నించడంతో అల్ఖైదా ఉగ్రవాద శిక్షణ విషయం వెలుగు చూసింది.
బిల్హా కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడిన షా ముదిసర్, షోయబ్ల నుంచి సెల్ఫోన్లు, పాస్పోర్టు, ఏటీఎం, జిహాద్ సాహిత్యం, మిలిటెంట్ శిక్షణ కార్యక్రమానికి చెందిన పత్రాలు, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై దేశద్రోహం, పేలుళ్లకు కుట్ర తదితర కేసులను నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.