ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (13:29 IST)

మహానగరంలో మహిళలే లేరా? మూడంటే మూడే సీట్లు

హైదరాబాద్ మహానగరంలో మహిళలు లేరా? ప్రధాన పార్టీల తరపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేవలం ముగ్గురంటే ముగ్గురు మాత్రమే అర్హులా? మిగిలిన మహిళలకు పోటీ చేసే అర్హత లేదా? అన్ని రాజకీయ పార్టీలకు మహిళల ఓట్లు మాత్రం కావాలి.. కానీ వారికి టిక్కెట్లు మాత్రం ఇచ్చేందుకు మనసురాదా? అనే విమర్శలు తలెత్తుతున్నాయి. 
 
గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో మొత్తం 27 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో మహిళా ఓటర్ల సంఖ్య మొత్తం ఓటర్లలో 50 శాతం మేరకు ఉన్నారు. కానీ, రాజకీయ పార్టీలు మాత్రం ఆస్థాయిలో మహిళలకు సీట్లు కేటాయించలేకపోయాయి. చివరకు ప్రధాన పార్టీలు మహిళలకు ఎక్కువగా టికెట్లు కేటాయించలేక పోవడం గమనార్హం. స్థానిక సంస్థల్లో వారికి 50 శాతం టికెట్లు ఇవ్వాలనే రిజర్వేషన్‌తో అన్ని పార్టీలు ఆ మేరకు ప్రకటించాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పరిస్థితి తారుమారైంది. అన్ని ప్రధాన పార్టీలు కలిసి కేవలం ముగ్గురంటే ముగ్గురుకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చాయి. వీరిలో... 
 
* మహేశ్వరం స్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా హోం మంత్రిగా పని చేసిన సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేటాయించింది. దీంతో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. మహాకూటమి పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం 27 సీట్లకు గాను 19 చోట్ల పోటీ చేస్తుంది. కానీ, మహిళలకు ఇచ్చిన సీటు మాత్రం ఒక్కటంటే ఒక్కటి. 
 
* మహాకూటమిలో ఓ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తోంది. కూకట్‌పల్లి స్థానంలో నందమూరి వెంకట సుహాసిని సీటు కేటాయించింది. అంటే ఈ పార్టీ కూడా ఒకే స్థానాన్ని మహిళలకు ఇచ్చింది. 
 
* జాతీయ పార్టీ బీజేపీ ఏకంగా 27 చోట్ల ఒంటరిపోరు చేస్తోంది. ఈ పార్టీ కూడా చాంద్రాయణగుట్టలో సయ్యద్ షహెజాదీని బరిలోకి దించింది. 
 
* అధికార తెరాస పార్టీ 27 సీట్లలో పోటీ చేస్తున్నా.. ఒక్క మహిళా అభ్యర్థికీ అవకాశం ఇవ్వక పోవడం చెప్పుకోదగ్గ విషయం. కానీ, గోషామహల్ నుంచి మాత్రం తెరాస రెబల్ అభ్యర్థిగా శీలం సరస్వతి, స్వతంత్ర అభ్యర్థిగా వీణాదేవిలు నామినేషన్లు దాఖలు చేశారు. 
 
* దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఒకరు, సీపీఎం తరపున ఒకరు ఉప్పల్‌లో పోటీ చేస్తుండగా, ఖైరతాబాద్‌ స్థానంలో జాతీయ మహిళా పార్టీ తరపున ప్రియాంక, సీపీఎం తరపున వినోదలు బరిలో ఉన్నారు. మల్కాజిగిరి స్థానం నుంచి ఎం.వాణి, ఆర్. సుజాతలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు.