శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (20:11 IST)

కాంగ్రెస్ ఎమ్మెల్యేపై దాడి.. 5న పాలమూరు జిల్లా బంద్ : టీ కాంగ్రెస్ పిలుపు

మహబూబ్ నగర్ జిల్లా జెడ్పీ సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది. తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డిపై చేయిచేసుకున్నారు. ఈ దాడికి నిరసనగా టీ కాంగ్రెస్ శనివారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే, రామ్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని కూడా ఆయన ఖండించారు. 
 
వాస్తవానికి జెడ్పీ సమావేశం కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు, టీడీపీ ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డిలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిల మధ్య వాదులాట జరిగింది. 
 
ఈ క్రమంలో జరిగిన తోపులాటలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజుకు గాయాలయ్యాయి. దీంతో, తనపై దాడి చేసిన చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలని బాలరాజు డిమాండ్ చేశారు. పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో, గొడవ పెరగకుండా ఇద్దరికీ పోలీసులు నచ్చజెప్పారు. 
 
కాగా, జిల్లా పరిషత్ సమావేశం సందర్భంగా రామ్మోహన్ రెడ్డిపై దాడి చేసిన అనంతరం అతనిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని బాలరాజు డిమాండ్ చేసిన సంగతితెలిసిందే. దళితుడైనందుకే తనపై రామ్మోహన్ రెడ్డి చేయి చేసుకున్నారని బాలరాజు ఆరోపిస్తున్నారు.