శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2015 (12:22 IST)

జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తారా లేదా? : హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల (జీహెస్ఎంసీ)పై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ ఎన్నికల నిర్వహణలో తీవ్ర జాప్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది. ఈ ఎన్నికలను తక్షణం నిర్వహించాలని కోరుతూ కోర్టులో దాఖలైన పిటీషన్‌ గురువారం మరోమారు విచారణ చేపట్టి పై విధంగా వ్యాఖ్యానించింది.
 
జీహెస్‌ఎంసీ ఎన్నికలు మీరు నిర్వహిస్తారా? లేక మేము జోక్యం చేసుకోవాలా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఒకవేళ రాష్ట్ర ఈసీ ఎన్నికలు నిర్వహించకపోతే, ఆ పనిని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అప్పగిస్తామని స్పష్టం చేసింది. గతంలో ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం 249 రోజుల గడువు కోరింది. మరో అభ్యర్థనలో 150 రోజుల గడువు కోరింది. 
 
ఇలా గందరగోళానికి గురయ్యేలా ఉన్న ఈ గడువుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇలా ప్రతిసారీ గడువు కోరడం సబబుకాదని చెప్పింది. మీరు నిర్ణయం తీసుకోకుంటే మేమే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీచేస్తామని తేల్చి చెప్పింది. 200 వార్డుల విభజనపై నేడు కోర్టుకు ప్రభుత్వం నివేదిక అందించింది. తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.