గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2017 (13:32 IST)

హైదరాబాద్ మెట్రో రైళ్ళకు అనూహ్య స్పందన

హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలకు భాగ్యనగరివాసుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.

హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలకు భాగ్యనగరివాసుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. నవంబరు 29వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మెట్రో రైల్ సేవలు భాగ్యనగరి వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన విషయం తెల్సిందే.
 
తొలిరోజునే లక్ష మంది ప్రయాణించగా ఆ సంఖ్య నానాటికీ క్రమంగా పెరుగుతోంది. శని, ఆదివారాల్లో అయితే ఈ సంఖ్య లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉంది. అయితే నేటికీ ఉద్యోగులు, రోజువారి ప్రయాణికుల కంటే మెట్రో రైల్ ప్రయాణపు అనుభూతి కోసం ప్రయాణిస్తున్నవారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
 
శని, ఆదివారాలలో మెట్రోలో ప్రయాణించినవారిలో చాలా మంది మెట్రో స్టేషన్‌లో, మెట్రో రైల్లో సెల్ఫీలు తీసుకోవడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మెట్రోలో రోజువారి ప్రయాణికుల సంఖ్యపై హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని మెట్రి ఎండి ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు.
 
మెట్రో కారిడార్‌లో మియాపూర్ నుంచి నాగోల్ వరకు గల అన్ని స్టేషన్లు రద్దీగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమీర్‌పేట మెట్రో స్టేషన్ నగరం నడిబొడ్డున ఉన్న కారణంగా అక్కడ తెల్లవారుజాము నుంచి ఆఖరురైలు వెళ్ళేవరకు చాలా రద్దీగా ఉంటోంది. విద్యార్థులు కూడా ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం వారు నెలవారీ పాస్‌లు కొనుగోలు చేస్తున్నారు.